ఈ విషయంలో నిజా నిజాలు ఒక్కసారి చర్చించుకుందాము
కొన్ని నిజాలు:
1) 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అవిశ్రాంతంగా శ్రమించి ప్రచారం చేసినా ఆ పార్టీకి వచ్చింది 18 సీట్లే! చిరంజీవి + పవన్ కళ్యాణ్ = 18 సీట్లు,
నిజానికి ఆ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం పవన్ కంటే, చిరంజీవి పై అభిమానం తోనే ఆ పార్టీకి మద్దతిచ్చారు. కాపు సామాజిక వర్గం లో ఇప్పటికి పవన్ కంటే చిరంజీవికే ఎక్కువ అభిమానులున్నారు అంటే చిరంజీవి - పవన్ కళ్యాణ్ = ?
2) నిజంగా పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో అంత పలుకుబడే ఉంటే, ఓటర్లను ప్రభావితం చేయగలిగే శక్తే ఉండి ఉంటె కనుక 'పాలకొల్లు' నియోజకవర్గంలో చిరంజీవి అంత ఘోరంగా ఓడిపోయి ఉండేవాడా?
3) ప్రజారాజ్యం పార్టీకి ఆ ఎన్నికల్లో 17 జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఆ జిల్లాల్లో శూన్యమే అని చెప్పుకోవచ్చు కదా!
4) 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కంటే ప్రచారం చేయని నియోజకవర్గాల్లో తెదేపా, బిజెపి కూటమి ఎక్కవ శాతం గెలిచింది
5) అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి తో పొత్తు లేకుండా పోటి చేసిన తెదేపా, వైకాపా ఓట్ల తేడా 3.2 శాతం ఉంది, అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తో కలిసి పోటీచేసి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా కూడా ఆ ఎనికల్లో తెదేపా, వైకాపా ఓట్ల తేడా కేవలం 2.06 శాతం మాత్రమె ఉంది.. అంటే దీనర్ధం బిజెపి తో పొత్తు, పవన్ కళ్యాణ్ ప్రచారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పెద్దగా లాభించలేదని ఈ గణాంకాలు అర్ధమైన ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.
6) రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు జిల్లాల్లో తన సామాజిక వర్గం (కాపు/బలిజ) ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కనీసం ఒక్క అసెంబ్లీ కాని, పార్లమెంట్ కాని తెలుగుదేశం పార్టీ గెలవలేదంటే మరి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కడుంది? పైగా అనాదిగా తెదేపా కు బలమైన, 2009 ఎన్నికల్లో కూడా గెలిచిన కదిరి, ఆదోని వంటి స్థానాలను, కర్నూలు వంటి సులువుగా గెలిచే స్థానాన్ని కూడా పోగొట్టుకుంది.
Note: కానీ ఒక్క నిజం మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి.. 2009 ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ శిఖండి పాత్ర పోషించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపును అడ్డుకున్నాడు, ఈ ఎన్నికల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పోటి చేస్తే తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత నష్టపోయేది.(ప్రజారాజ్యం పార్టీ ప్రయోగంతో చేతులు కాల్చుకున్న చిరంజీవి బ్రదర్స్ మరోసారి అందుకు సాహసించకపోవటం తెలుగుదేశం పార్టీకి కొంత లాభించింది)
కొన్ని ప్రశ్నలు:
1) అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ అవినీతి నాయకులను పంచెలు ఊడదీసి తంతానని స్టేట్మెంట్లు ఇచ్చి, ఆ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న తరువాత తన అన్న చిరంజీవి టోకుగా తన పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నప్పుడు కానీ, అదే కాంగ్రెస్ నాయకులు, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి దొబ్బెసినప్పుడు కానీ మరి ప్యాంటు విప్పదీసి కొట్టలేదే?
2) తన అన్న చిరంజీవి పార్లమెంటు నిండు సభలో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ ను ముక్కలుగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నప్పుడు కానీ, ఆ తరువాత కానీ ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ప్రజాభీష్టానికి తలొగ్గి తన మంత్రి పదవికి గాని, రాజ్య సభ సభ్యత్వానికి గాని రాజీనామా చేయనప్పుడు తన అన్నని ఎందుకు ప్రశ్నించలేదు?
3) కేంద్రం లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దిల్లీలో మోడితో, వెంకయ్య నాయుడు తో కలిసి ఫోజులిచ్చి, అంట కాగిన పవన్ కళ్యాణ్ బిజెపి నాయకులతో, ప్రధానమంత్రితో తనకున్న సాన్నిహిత్యాన్ని, పలుకుబడిని ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా కల్పనకై ఎప్పుడైనా ప్రయత్నించటం కానీ, ప్రశ్నించటం కానీ చేశాడా?
4) రాజధాని ప్రాంతం లో కాపు, రెడ్డి సామాజిక వర్గాల వారు ఎక్కువగా ఉన్న ఇదు గ్రామాల్లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆ ప్రాంతానికి వచ్చి రాజధానికి భూ సమీకరణకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి, రాజధానికి భూములు ఇవ్వవద్దని చెప్పి , అవసరమైతే వారికి అండగా పోరాటం చేస్తానని వారిని మభ్య పెట్టి, ఆ బూచి చూపించి చంద్రబాబు నాయుడుతో పైరవీ చేయించుకుని తన అనుంగు మిత్రుడు పసుపులేటి హరి ప్రసాద్ కు దొడ్డిదారిన టిటిడి బోర్డు సభ్యత్వం ఇప్పించుకోవటమే కాకుండా బిజెపి ఎమ్మెల్సి కోటాలో ఎన్నిక కావలసిన యడ్లపాటి రఘునాధ బాబు స్థానంలో తన మిత్రుడు సోము వీర్రాజుకు సీటు ఇప్పించుకుని, ఆ తరువాత రాజధాని రైతుల విషయం పక్కన పెట్టటం వాస్తవం కాదా?
5) అనేక ఆర్ధిక కుంభకోణాల్లో ఇరుక్కున్న పొట్లూరి వరప్రసాద్ వద్ద 50 కోట్లు నాకేసి గత పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ స్థానానికి ఆయన అభ్యర్ధిత్వానికి తీవ్రంగా కృషిచేసి, చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా వత్తిడి తెచ్చినా ఫలించకపోవటం, అప్పుడు సుజనా చౌదరి కూడా కేశినేని నానికే మద్దతు పలకటం వంటి కారణాలు మనసులో ఉంచుకునే ఇప్పుడు వారిపై అనవసరపు విమర్శలు చేస్తున్నాడా?
6) వ్యాపారాలు చేసుకోనేవాళ్ళు యంపిలుగా అనవసరం అనే అర్ధం వచ్చే విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం యంపి లు వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు.. కానీ చిరంజీవి రాజకీయాలనే వ్యాపారంగా మార్చేశాడనే విషయం పవన్ కళ్యాణ్ కు తెలీదా? పార్లమెంటులో కేశినేని నాని, చిరంజీవి ... ఈ ఇద్దరిలో ఎవ్వరు ఎక్కువ సేపు మాట్లాడారో, ఎక్కువ ప్రశ్నలు సంధించారో రికార్డులు చూసాడా, లేక కేవలం అతనిపై అక్కసుతోనే విమర్శలు చేశాడా?
7) తన నిర్మాత, ఆప్తుడు బండ్ల గణేష్ వ్యాపార భాగస్వామి, తనకు కూడా ఆప్త మిత్రుడు బొత్స సత్యన్నారాయణకు రాజకీయ శత్రువు... రాజకీయాల్లో అజాత శత్రువు అశోక గజపతి రాజు వంటి వాడి మీదనే విమర్శలు చేసాడంటే వాటి వెనుక కూడా వేరే అర్ధాలు ఉన్నాయనే అనుకోవాలా?
ఇప్పటికి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగితే చాలు.... ఇంకొన్ని ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి.
Note: పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటిని ప్రశ్నించే స్థాయి నాకు లేదు కానీ, ఓ సామాన్యుడిగా 'జన సేన' సారధిని ప్రశ్నిస్తున్నాను. నా వాదనలో తప్పులుంటే తెలియచేయండి అంతే కాని అనవసరంగా అసభ్య వ్యాఖ్యానాలు చేసి సంస్కార హీనులుగా నిరూపించుకోకండి. సామాన్యుడికి కూడా రాజకీయ నాయకుడిని, సెలబ్రిటిని ప్రశ్నించే హక్కు ఉంటుంది అని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే శలవిచ్చారు మరి.