వార్డ్ కౌన్సిలర్ల దగ్గరనుండి, యంయల్యే, యంపిల వరకు రాజకీయాల్లోకి రాకముందు ఎకరం పొలం కాని, కనీసం సొంత ఇల్లు కూడా లేని వాళ్ళు చాలామంది ఆ తరువాత కోట్లకు పడగలెత్తుతున్నారు.. ద్విచక్ర వాహనం కూడా లేనివారు బెంజ్, BMW వంటి విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారు, రాజ సౌధాల్లో నివాసం ఉంటూ, టాటా, బిర్లాలను తల దన్నె రీతిలో వ్యాపార సామ్రాజ్యాని ఏర్పాటు చేసుకుంటున్నారు.
రాజకీయాల్లో దొరికిన వాడు దొంగ... దొరకని వాడు దొరలాగా దర్జాగా తిరుగుతున్నాడు. వేల కోట్ల అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన వాడు కూడా తను అవినీతి చేయలేదని, రాజకీయ కక్షతో ప్రత్యర్ధులు ఇరికించారని ఎదురు దాడి చేస్తున్నాడు.. దొరకని వాడి సంగతి సరేసరి! దొరికిన వాడి మీద బురద చల్లుతూ .. తానో పవిత్రుడిలాగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు. ప్రజలకివన్ని తెలిసినా మతాభిమానంతోనో, ప్రాంతీయాభిమానంతోనో, కులాభిమానంతోనో మిన్నకుండి పోతున్నారు. "అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం" అనే సామెతను గుర్తుకు తెచ్చే విధంగా మన దేశంలో రాజకీయ నాయకుల ప్రవర్తన, వ్యవహారం ఉంది. రాజకీయ నాయకులందరూ నీతి మంతులే! వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజలే పిచ్చి వెధవలు, అమాయకులు, మూర్ఖులు (అందరూ కాదండోయ్.. ఓటుకు నోటు తీసుకొని వారు మాత్రమే).
మత పరంగానో, కుల పరంగానో, ప్రాంతీయ పరంగానో రాజకీయ నాయకులను అభిమానించే సంస్కృతి మన దేశ ప్రజల్లో ఎక్కువగా ఉంది. అన్నీ తెలిసిన వాళ్ళు, విద్యావంతులు (మీరు, నేను కూడా)కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు!
విభిన్న సంస్కృతులు, జాతులు, మతాలూ, కులాలు కలిగి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో మనకు బోలెడంత వాక్ స్వాతంత్రం ఉంది.. అందుకే మనకు నచ్చిన వాడు ఎంత వెధవైనా జై కొడదాం! మనకు నచ్చని వాడు ఎంత మంచి వాడైనా ఛీ కొడదాం!!