ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు "రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ శాసనసభ విచారం వ్యక్తం చేస్తోంది. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతున్నాం. రాష్ట్ర అభిప్రాయం తెలుసుకోకుండా పేరు పెట్టడం మంచిది కాదు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాజీవ్గాంధీ పేరునే కొనసాగించాలి. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసి, రాష్ట్రాన్ని సంప్రదించి పేరు మార్పుపై నిర్ణయం తీసుకోవాలి" అని తీర్మానం చదివి వినిపించారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలియ చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా నేతల పేర్లను రుద్దడం సరికాదన్నారు. తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రం వాళ్ల పేర్లు ఎందుకు అని కేసీఆర్ ప్రశ్నించారు.
రాజీవ్ గాంధీ కెసిఆర్ కు, తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులకు 'తెలంగాణా' వాడి లాగా కనిపించాడా? రామారావు తెలంగాణా వాడు కానప్పుడు మరి రాజీవ్ గాంధీ కూడా తెలంగాణా వాడు కాదు కదా? మరి రాజీవ్ గాంధీ పేరు కూడా తొలగించి ఎవరైనా రెడ్డి, వెలమ నాయకుడి పేరు కాకుండా ఒక దళిత నాయకుడి పేరు ఎయిర్ పోర్టుకు పెట్టాలని తీర్మానం చేస్తే నిష్పక్షపాతంగా ఉండేది.
నందమూరి తారక రామారావు సమైక్య ఆంధ్ర రాష్ట్రానికి ముఖమంత్రిగా చేసిన మహా నాయకుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ, రాజకీయాలకు అతీతుడు. తెలుగు వాడి వాడి, వేడి, తెలుగు జాతి పౌరుషం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి మన జాతికే వన్నె తెచ్చిన మహానుభావుదు. అటువంటి వ్యక్తీ పేరే ఆయన మీద అభిమానంతో తన కొడుక్కి కూడా పెట్టుకున్నానని గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావే స్వయంగా చెప్పాడు. ఇప్పుడేమో సంకుచిత స్వభావంతో రామారావు పేరు కు ఆంధ్ర నేత అంటూ అభ్యంతరం తెలుపుతున్నాడు.
ప్రస్తుత అసెంబ్లీ లో ఉన్న ముఖ్యమంత్రి, స్పీకర్, ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డి, జీవన్ రెడ్డి వంటి వారితో పాటు సగం మంది MLA లను రాజకీయాలకు పరిచయం చేసింది, వారికి మంత్రి పదవులిచ్చింది ఎన్టీఆర్ అనే విషయం కూడా మరచి హేయంగా ప్రవర్తించటం సిగ్గుచేటు. తమకు రాజకీయ బిక్ష పెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావే అని వాళ్ళు కూడా చాలా సందర్బాలలో చెప్పారు.
తెరాస పార్టీ, కెసిఆర్ తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలు రెండూ 'తెలుగు రాష్ట్రాలేనని' ముందుగా గుర్తుంచుకోవాలి. తెలంగాణా రాష్ట్రంలో అన్ని కట్టడాలకు తెలుగు వారి పేర్లు, మరీ ముఖ్యంగా తెలంగాణా ప్రాంతం వారి పేర్లు పెట్టాలంటే ముందుగా నెహ్రు, గాంధి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు తీసివేయాలి. కెసిఆర్ కు ఆ దమ్ముందా? వీళ్ళెవరు మరి తెలుగు వారు కాని, తెలంగాణా వారు కానీ కారు కదా?
జాతీయ నాయకులను, ప్రజా నాయకులను కుల, మత, ప్రాంతీయ తత్త్వం తో చూడటం ఒక ముఖ్యమంత్రికి కానీ, పార్టీలకు కాని మంచిది కాదు, ఇటువంటి చర్యలు సంస్కారం కూడా అనిపించుకొవు. ఇంత సంస్కార హీనంగా, సంకుచితత్వంతో ప్రవర్తించే ముఖ్యమంత్రి బహుశా మనమెప్పుడు, ఎక్కడా చూసి ఉండము. ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా తప్పు తెలుసుకుని హుందాగా ప్రవర్తించాలి, లేక పొతే రాబోయే కాలంలో చరిత్ర హీనుడిగా మిగిలి పోతాడు.
గతంలో రాష్ట్ర విభజన చేయడానికి వీల్లేదంటూ సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే.. ఆ తీర్మానం చిత్తు కాగితంతో సమానమని, చెత్తబుట్టలో వేసేందుకు కూడా పనికిరాదంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ కానీ, తెలంగాణా కాంగ్రెస్ నేతలు కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్టీఆర్ పేరుపై చేసిన తీర్మానం కూడా చిత్తు కాగితంతో సమానం అని గుర్తుపెట్టుకుంటే మంచిది.
మహానుభావా ఎన్టీఆర్! ఈ మూర్ఖులను క్షమించు, శపించకు!!