ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించడం వల్ల పన్నుల మినహాయింపు, అధిక నిధుల కేటాయింపుకు వెసులుబాటు కల్పిస్తారు. పన్ను రాయితీల ప్రయోజనం ఉండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో పరిశ్రమల స్థాపన జరిగి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతోపాటు రాష్ట్రానికి ఆదాయం కూడా లభించి రెవిన్యూ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్లో పర్యటించి ఎన్నికల సభల్లో పాల్గొన్న మోడీ, వెంకయ్య నాయుడు తము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా ఐదేళ్ళ నుంచి పదేళ్లకు పెంచుతామని, ఆంధ్ర ప్రదేశ్ కు ఏర్పడే 13 వేల కోట్ల రెవిన్యూ లోటు తీర్చటానికి కుడా తాము సహాయం చేస్తామని వాగ్దానం చేయటంతోపాటు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిందని వాపొయారు. ఆ మాటలు నమ్మిన ఆంధ్ర ఓటర్లు భాజపా ను రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలిపించారు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలు తీరాలంటే భాజపా అవసరాన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కేవలం ఒక్కరికి స్థానం తో సరిపెట్టుకోవటమే కాకుండా భాజపాకు చెందిన మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఖాళీగా ఉన్న ఏకైక రాజ్యసభ సీటును త్యాగం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి మరికొద్ది రోజుల్లోనే ఆరు నెలలు పూర్తయిపోతాయి. కేంద్ర మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి డిల్లి పర్యటనలో ప్రధాన మంత్రిని, మంత్రులను కలిసినప్పుడు 'ఆంధ్ర ప్రదేశ్' రాష్ట్రానికి ప్రత్యెక హోదా అంశం చర్చకు వచ్చినప్పుడల్లా అతి త్వరలోనే అంటూ ప్రకటన వెలువడుతుంది. పిచ్చి జనాలు నిజమే కాబోలు అంటూ నమ్మేస్తున్నారు.
ఒకసారి కేంద్ర కాబినెట్ ఆమోదం పొందిన బిల్లు ప్రభుత్వం మారినా మరోసారి ఆమోదం పొందనవసరం లేదు, వెంటనే ప్రణాళికా సంఘానికి పంపి ఆమోదింప చేసుకొని చట్టం చేయవచ్చు, కానీ ఈ ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ తాత్సారం చేస్తుంది.
ఇంత ఆలస్యానికి కారణం ఏమిటో చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి చెందిన తెదేపా, భాజపా, యమ్.పి లు, మంత్రులు... ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను గట్టిగా నిలదీయాలి. విభజన విషయంలో ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్ర ప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగింది. ఇప్పుడు భాజపా, మోడీ మాటలు నమ్మి ఓట్లేసి మరింతగా మోసపోయామని, మోడీ తీరు, వెంకయ్య నాయుడు ప్రవర్తన 'యేరు దాటిన తరువాత తెప్ప తగలేసిన చందంగా' ఉందని ఆంధ్ర ప్రజలు తలపొస్తున్నారు.
పార్లమెంట్లో పూర్తి సంఖ్యా బలం ఉన్న భాజపా ప్రభుత్వం ఇప్పటికైనా తన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి.