చంద్రబాబు నాయుడి ప్రోత్సాహంతో తలసాని రాజకీయ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు, చిన్న వయసులోనే శాసనసభ్యుడు, మంత్రి అయ్యాడు, నగరంలో తనకన్నా పార్టీలో సీనియర్లు కృష్ణ యాదవ్, విజయరామారావు, శ్రీపతి రాజేశ్వర్ లను వెనక్కి నెట్టి అన్ని అవకాశాలను చేజిక్కించుకుని తెలుగుదేశం పార్టీలో 'ఒకే ఒక్కడుగా' చలామణి అయ్యాడు.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పక్కా సమైక్య వాదిగా వ్యహరించిన తలసాని చంద్రబాబు నాయుడు 'తెలంగాణాకు అనుకూలంగా ' కేంద్రానికి లేఖ ఇచ్చినప్పుడు బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. కొన్ని కారణాల వలన పార్టీకి దేవేందర్ గౌడ్, కృష్ణ యాదవ్ దూరమైనప్పుడు నగర తెలుగుదేశం పార్టీలో మరొకరిని ఎదగనివ్వకుండా చేసి తనే చక్రం తిప్పాడు. తదనంతర పరిణామాల్లో దేవేందర్ గౌడ్, కృష్ణ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరటం, ఆర్. కృష్ణయ్య గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరగానే ఆయన్ను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రచారం చేయటం ఆయనకు ఏమాత్రం మింగుడు పడలేదు.
సమైక్య వాదిగా ముద్రపడటం, సికింద్రాబాదు నియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా లేకపోవటం కారణంగా ఆ నియోజకవర్గంలో తన గెలుపుపై నమ్మకంలేని తలసాని గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని తెలుగుదేశం పార్టీకి బలమైన, సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉన్న 'సనత్ నగర్' నియోజకవర్గానికి టికెట్ ఇప్పించుకొని శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.
ఈ ఎన్నికలలో జంట నగరాలనుండి 8 మంది తెలుగుదేశం శాసనసభ్యులు ఎన్నికవటం అప్పటివరకు పార్టీలో 'ఒకే ఒక్కడు' గా చలామణి అయిన తలసానిలో కొంత అభద్రతా భావాన్ని పెంచింది. అందరిలో ఒక్కడుగా ఇమడలేక పోయాడు, పార్టీలో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, మొదలైన వారి దూకుడు ఆయన్ను కొంత ఇబ్బంది పెట్టింది. 'తాను పీకలేడు ఎదుటివాడు పీకుతుంటే ఒర్వలేడు' అనే చందంగా తలసాని పరిస్థితి తయారైంది.
పార్టీ అధ్యక్షుడి నుండి ఎన్ని హామీలు పొందినా కానీ ఆయనలో అభద్రతా భావం అనుమానం బాగా ఎక్కువై ఇష్టమున్నా, లేకపోయినా... గతంలో పక్కా సమైక్యవాదిగా ఉన్నప్పుడు తెరాస పార్టీని, కెసిఆర్ ని బండ బూతులు తిట్టిన తలసాని అదే పార్టీతో జత కట్టటానికి సిద్ధమైనప్పుడు, ఆయన మానసిక పరిస్థితి, నైజం బాగా తెలిసిన చంద్రబాబు నాయుడు కెసిఆర్ తో ఆయన వేగటం కష్టం అని, ఓర్పుగా ఉంటే తెలుదేశం పార్టీకి తెలంగాణలో మంచి రోజులు వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించి ఇంతకాలం పార్టీలోనే ఉన్న తలసానికి భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటుందని ఎన్నో రకాలుగా నచ్చచెప్పాడు.
కానీ ఇవేమీ ఆయన్ను సంతృప్తి పరచలేక పోయాయి, 'అత్త తిట్టినందుకు కాదు గాని, తోడికోడలు దేప్పింది' అనే చందంగా చంద్రబాబు నాయుడు పైన కోపం కంటే పార్టీలోని ఇతర నాయకుల పైన అసూయతోనే ఓ మంచి ముహూర్తం చూసుకుని తెరాస పార్టీలోకి జంపైపోయాడు... అలాగని తెరాస పార్టీలోకి చేరే విషయంలో ఆయనకు చంద్రశేఖర రావు నుండి పెద్దగా హామీలు కూడా లభించలేదు. తెరాస , కెసిఆర్ స్క్రిప్ట్ ప్రకారం ఈ సారి రివర్సు పద్ధతిలో తనకు 'రాజకీయ భిక్ష' ప్రసాదించిన చంద్రబాబు పైనే తీవ్రమైన విమర్శలు చేశాడు. గతంలో తెరాస , కెసిఆర్ పైన గతంలో తను చేసిన విమర్శలను 'తూచ్' అంటూ తేలికగా కొట్టేశాడు.
ఆ తరువాతే మొదలైంది అసలు సినిమా! సికింద్రాబాదు నియోజకవర్గంలో తన అనుచరగణం కొంత మంది తెలుగుదేశం పార్టీలోనే ఉండి పోగా, మరి కొంత మంది తమ రాజకీయ అవసరాల కోసం తన రాజకీయ ప్రత్యర్ధి, ప్రస్తుత మంత్రి పద్మారావు పంచన చేరిపోయారు. తను శాసనసభ్యునిగా గెలిచిన 'సనత్ నగర్' నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీలో పట్టున్న నాయకులను కాని, పార్టీ కేడర్ ను కాని తన వెంట తెరాస పార్టీలోకి తెచ్చుకోలేక పోయాడు.
తలసాని తెరాస పార్టీలో చేరిన తరువాత కెసిఆర్ జరిపించిన సర్వే 'సనత్ నగర్' నియోజక వర్గంలో ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిషేద చట్టం ప్రకారం తలసాని రాజీనామా చేసి ఎన్నకలలో పోటి చేయవలసిన పరిస్థితి వస్తే ఆయనకు గెలుపు కష్టమే అని, మరో పక్క జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తలసాని ప్రభావం ఉండదని, నియోజకవర్గంలో తెరాస పార్టీకి ఒక్క కార్పొరేటర్ స్థానం మాత్రమే దక్కే అవకాశం ఉందని తేలింది. ఈ నియోజకవర్గంలో తెరాస నుండి గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన 'దండె విట్టల్' వర్గం కూడా ఏమాత్రం తలసానికి సహకరించటం లేదు, ఈ పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో తలసానికి తెరాస పార్టీలో కాని, ముఖ్యమంత్రి వద్ద కాని సరైన గౌరవం దక్కటం లేదని ఆయన వర్గీయులు బాహాటంగా వాపోతున్నారు.
ఒక పక్క ప్రతిపక్షంలో ఉన్న తన పాత సహచరులు, బిజెపి మిత్రపక్షం అండతో అసెంబ్లీలో చెలరేగి పోవటం, జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలు జత కట్టాలని నిర్ణయం తీసుకోవటం, గ్రేటర్లో ఆ కూటమికి పెరుగుతున్న ఆదరణ, తన ప్రత్యర్ధి కృష్ణ యాదవ్ కు గ్రేటర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కే అవకాశం ఉండటం తలసానిని మరింత అసహనానికి గురిచేస్తుంది.
ప్రస్తుతం తలసాని పరిస్థితి 'రెండిటికి చెడ్డ రేవడిలా' తయారైంది... 'చెరపకురా చెడేవు' అనే సామెత ఈయనకు బాగా వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, రాబోయే రోజుల్లో తలసాని రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు. 'చేసుకున్నవాడికి చేసుకున్నంత' అనే సామెత తలసాని గుర్తు చేసుకుంటే బాగుంటుంది.