గత ఎన్నికలముందు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదని భావించిన చాలా మంది నాయకులు భాజపాలొ చేరారు. వీరిలో పురందేశ్వరి లాంటి ఒకరిద్దరు నాయకులు తప్ప మిగిలిన వారంతా ప్రజా బలం లేనివారే!
ఎన్నికల తరువాత పెద్దగా చేరికలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ, వైకాపా నుండి కొంతమంది నాయకులు ఆ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ సమయం చూసుకొని భాజపా లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. తమ రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతోనే మొదలుపెట్టి, ఇప్పటి వరకు ఆ పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీతో వైరం నెరపిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా భాజపానే చూస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండటం, ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్డటం వంటి కారణాలతో వీరు తప్పనిసరి పరిస్థితుల్లో భాజపా గూటికే చేరాలని చూస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహకారం లభించక పోయినా రుణమాఫీ వంటి భారీ ఖర్చుతో కూడుకున్న పధకాల అమలుకు కృషి చేస్తున్నాడు, కొత్త రాజధాని నిర్మాణం, పారిశ్రామిక ప్రగతి వంటి విషయాల్లో ఒంటరిగానే శ్రమిస్తున్నాడు. అప్పులు, లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కొద్ది కాలంలోనే ప్రగతి పధం వైపు మళ్లిస్తాడనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు ఈ ఐదేళ్లలో చంద్రబాబు పూర్తిగా అమలు చేస్తాడని ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ మంది ప్రజలు విశ్వసిస్తున్నారు.
గతంలో ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా పార్లమెంట్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని, రెవిన్యూ లోటును పూరించటానికి సహాయం చేస్తామని, 10 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి 'ప్రత్యెక రాష్ట్ర' హోదాను అమలు చేస్తామని వెంకయ్య నాయుడు, మోడీ మొదలైన వారు పార్లమెంట్లో ప్రకటించారు.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇవే పదాలు వల్లె వేశారు. హామీలే తప్ప ఈ ఆరు నెలల్లో ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం... ఈ హామీలు అమలైతే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కు బోలెడన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవి. బిజెపి పార్టీపై, మోడీ వాగ్దానాలపై కోటి ఆశలతో ఓటేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో గత ఎన్నికల ముందు బిజెపికి ఉన్న ప్రజాదరణ ప్రస్తుతం కొంత తగ్గిందే తప్ప ఏమాత్రం పెరగలెదు. జాతీయ పార్టీగా బిజెపి ని బలపరిచేవారు సైతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపికి ఏమాత్రం మద్దతివ్వరు, పైగా రాష్ట్రంలో వెంకయ్య నాయుడు తప్ప ఆ పార్టీకి ప్రజాదరణ, పలుకుబడి కలిగిన నాయకుడు ఎవరూ లేరు. పట్టణ ప్రాంతాల్లో తప్ప గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలనుండి అవినీతి ముద్ర పడిన కన్నా లక్ష్మీనారాయణ వంటి చౌకబారు నాయకులను చేరదీస్తే ఆ పార్టీకి నష్టమే తప్ప ఏమాత్రం లాభం కలుగదు.
కాంగ్రెస్, వైకాపా నుండి వచ్చి చేరే నాయకుల వలన బిజెపికి నాయకుల కొరత తీరవచ్చు, ఓట్ల శాతం కొంత పెరగవచ్చు కాని అవేమీ తెలుగు దేశం పార్టీకి నష్టం కలుగ చేయలేవు. ఆ పార్టీల నాయకుల చేరికతో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోతే తెలుగుదేశం పార్టీకే ప్రయోజనం అవుతుందే తప్ప నష్టం జరుగదు. బిజెపి నాయకులు వాపును చూసుకుని బలుపు అని భ్రమపడితే వారికే నష్టం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు.. కాంగ్రెస్ పార్టీ లేదా వైకాపా బలహీన పడితే ప్రయోజనం పొందేది కేవలం తెలుగుదేశం పార్టీనే!
మత రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి హిందువుల ఆదరణ, మద్దతు లభించవచ్చేమో కాని, ఆ ప్రభావం తక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రంలో బిజెపికి ప్రజాదరణ లభిస్తుందనుకోవటం భ్రమే! బిజెపి గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుకొని పక్షంలో ఇప్పుడున్న బలం కూడా పడిపోయే అవకాశముంది. ఆంధ్ర ప్రదేశ్ లో కమలం పార్టీకి సైకిల్ ప్రయాణమే దిక్కు.. సైకిల్ దిగిన మరుక్షణం మళ్లీ బురదలో కూరుకు పోయినట్లే!