నెలకు ఉద్యోగుల జీతాలకు రూ.2500 కోట్లు, పెన్షన్లకు రూ.200 కోట్లు, వివిధ సంక్షేమ పథకాలకు రూ.500 కోట్లు, విద్యుత్ రాయితీకి రూ.300 కోట్లు, బిల్లుల చెల్లింపులకు రూ.1,000 కోట్లు, సామాజిక పెన్షన్లకు రూ.400 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ప్రభుత్వంలోని ఇతరత్రా ఖర్చులకు మరో రూ.1,000 కోట్లు...మొత్తంగా నెలకు దాదాపు రూ.6 వేల కోట్ల నిధులు అవసరం. కానీ... వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, రిజిస్ర్టేషన్లు, రవాణా, అటవీ, గనులపై వచ్చే ఆదాయం మొత్తం కలిపినా రూ.3500 కోట్లకు తక్కువగానే ఉంటోంది. ఎక్సైజ్ మినహా వాణిజ్యపన్నులపైనా ఆశించిన ఆదాయం రావడం లేదు. రాజధాని బూమ్తో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తొలినాళ్లలో భూ క్రయవిక్రయాలు పెరిగి కాస్తంత ఆదాయం వచ్చింది. ఇదే ఊపు కొనసాగుతుందని భావించిన ప్రభుత్వానికి గత నాలుగైదు నెలలుగా రిజిస్ర్టేషన్ల ఆదాయం కొంత దెబ్బకొట్టింది. ప్రస్తుత ఆదాయం, లక్ష్యానికన్నా దాదాపు 16 శాతం తగ్గిపోయింది.
ఆదాయం లేక పోయినా రైతుల రుణమాఫీ కోసం తొలి విడతగా రూ.5,000 కోట్లు కేటాయించడం, రెండో దశలో కనీసం మరో రూ.2,000 కోట్లు కేటాయించాల్సి ఉండడంతో ఈ నిధులెలా తేవాలో ఆర్ధిక శాఖకు అంతుపట్టడం లేదు. కేంద్రం నుంచి సీఎస్టీ రూపంలో రావాల్సిన బకాయిలు నెల రోజుల్లో ఇస్తామని హామీ ఇచ్చినా.. ఇవి కూడా ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదని, ఫిబ్రవరి నెలాఖరుకన్నా వస్తాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆర్ధిక లోటు భర్తీ చేయటంలో సహాయం చేస్తామని వాగ్దానం చేసిన బిజెపి ప్రభుత్వం మాట తప్పింది. హుదుద్ తుఫాను సమయంలో వాగ్దానం చేసిన సహాయం తాలూకు సగం సొమ్ములు కూడా ఇంతవరకు అందచేయలేదు. జీతాలు చెల్లించటమే కష్టమైతే ఇక సంక్షేమ పధకాలకు నిధులెలా వస్తాయి? వర్షం కోసం ఎదురుచూసే చకోరపక్షిలా కేంద్ర ప్రభుత్వం వైపు చూడటం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి మరో అవకాశమెదీ కనిపించటంలేదు.
డబ్బుంటే ఏబాబైనా గొప్పోడే! డబ్బులేకుంటే ఏబాబైనా బికారే!!