ఎన్నికలకు ముందు దళితుడినే ముఖ్యమంత్రి చేసి తెలంగాణా రాష్ట్రానికి తను కాపలా కుక్కలాగా ఉంటానన్నాడు, ఎన్నికల సమయంలో తెరాస పార్టీ అధికారంలోకి వస్తే 'బంగారు తెలంగాణా' సాధిస్తామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరు పేదలకు రెండు పడక గదుల ఇళ్ళు కట్టిస్తామని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి, తెలంగాణలో ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తానని, నక్సలైట్ల పై నిషేధం ఎత్తివేస్తానని, వారి విధానమే తెరాస విధానమని మోస పూరిత, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసి, తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు ఇక ఉండవని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. తన కుటుంబంలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కించుకున్నాడు, యంపిగా ఎన్నికైన కూతురు కవితను 'ముడుపుల దుకాణానికి ముఖ్య అధికారిణిని' చేసి కలెక్షన్ల భాగోతానికి తెరలేపాడు.
తెలంగాణాను పారిశ్రామికవేత్తలకు పెట్టబడుల స్వర్గంగా, తమది ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానంగా అభివర్ణించిన కెసిఆర్ ఆ తరువాత పెట్టుబడులను ఆకర్షించటంలో ఘోరంగా విఫలమయ్యాడు. కేటిఆర్ అమెరికా పర్యటించినా, కెసిఆర్ చైనా పర్యటించినా, భారత దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను హైదరాబాద్ కు ఆహ్వానించినా పెట్టుబడులను సాధించటంలో, వారికి నమ్మకం కలిగించటంలో మాత్రం వైఫల్యం చెందాడు. కెసిఆర్ మాటల డాబుకు, ప్రఘల్బాలకు వారెవ్వరూ పడిపోలేదు.
తెలంగాణా రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగుల ఉద్యోగాలు లేవు, రైతుల ఆత్మహత్యలకు అంతే లేదు, రెండు పడకల గదుల ఇల్లు కాదు కదా పేదలకు కనీసం రెండు గదుల రేకుల షెడ్డు కూడా దిక్కు లేదు. మూడెకరాల స్థలం కాదు కదా! మూడు సెంటుల జాగా కూడా పేదలకు దక్కలేదు.
పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణా ఊసే లేదు. పరిశ్రమల స్థాపనకోసం రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు తిరుగు టపాలో 'ఆంధ్ర ప్రదేశ్' లో వాలి పోతున్నారు. కెసిఆర్ అదిలించి, బెదిరించి, ఈనాడు తో సహా మీడియానంతటిని, సాక్షాత్తు గవర్నర్ ను కూడా తన గుప్పిట్లో ఉంచుకుని ఇంకా భ్రమలు కల్పిస్తూ, అంతా బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేయించుకుంటున్నాడు. కానీ వాస్తవం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. న్యాయస్థానాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత, అనైతిక నిర్ణయాలను అనేకసార్లు అభిశంసించాయి, ఐనా కూడా కెసిఆర్ కు ఇంకా బుద్ధి రాలేదు సరికదా మరిన్ని మూర్ఖ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. త్వరలోనే ప్రజలు అన్ని విషయాలు గ్రహిస్తారు, అప్పుడు తప్పకుండా కెసిఆర్ భరతం, తెరాస పార్టీ భరతం పడతారు.