మనాలి పరిపాలనాపరంగా కులు జిల్లాలో భాగంగా ఉంది, జనాభా సుమారు 30,000. ఈ చిన్న పట్టణం లడఖ్ కు ప్రాచీన వర్తక మార్గ ప్రారంభంగా ఉండేది. మనాలి మరియు దాని చుట్టుప్రక్కల ప్రదేశం సప్తర్షి, లేదా ఏడుగురు ఋషుల నివాసంగా పేర్కొనబడటం వలన భారతీయ సంస్కృతి మరియు వారసత్వంలో అమిత ప్రాముఖ్యతను కలిగి ఉంది.
మనాలి బాగా చల్లని శీతాకాలాలు, మరియు మితమైన చల్లదనాన్ని కలిగిన వేసవికాల శీతోష్ణస్థితిని కలిగిఉంది. ఉష్ణోగ్రతలు సంవత్సరంలో 4సెంటీగ్రేడ్ నుండి 30సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. వేసవికాలంలో సగటు ఉష్ణోగ్రతలు 14సెంటీగ్రేడ్ నుండి 20సెంటీగ్రేడ్ వరకు, మరియు శీతాకాలంలో -7సెంటీగ్రేడ్ నుండి 10సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి.
ఒక మాసంలో ఉండే అవపాతం నవంబర్ నెలలో 24మిల్లీమీటర్ల నుండి జూలైలో 415మిల్లీమీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. శీతాకాలం మరియు వసంత ఋతువులలో సగటు అవపాతం 45మిల్లీమీటర్లగా ఉండి, ఋతుపవనాలు సమీపించడం వలన వేసవిలో 115మిల్లీమీటర్లకు పెరుగుతుంది. సగటు సాంవత్సరిక అవపాత మొత్తం 1520 మిల్లిమిటర్లు. ఈ ప్రాంతంలో సాధారణంగా మంచు డిసెంబర్ నెలలో కురుస్తుంది కాని, గత పదిహేను సంవత్సరాలుగా ఆలస్యమై జనవరి లేదా ఫిబ్రవరి నెల ప్రారంభంలో కురుస్తోంది.
మనాలి జాతీయ రహదారి 21 మరియు జాతీయరహదారి 1 ద్వారా ఢిల్లీతో కలుపబడింది, లే కు వెళ్ళే ఈ రహదారి ప్రపంచంలో అంత్యంత ఎత్తైన వాహనంలో ప్రయాణించగల రహదారిగా ప్రసిద్ధి చెందింది. న్యూ ఢిల్లీ నుండి మనాలి వెళ్ళే మార్గంలో ఉన్న పట్టణాలలో హర్యానాలోని పానిపట్ మరియు అంబాలా, చండీగర్, పంజాబ్ లోని రోపార్, మరియు బిలాస్పూర్, సుందర్ నగర్, మరియు హిమాచల్ లోని మండి ఉన్నాయి.
మనాలికి దక్షిణంగా ఉన్న నగ్గర్ కోట , పాల సామ్రాజ్యం యొక్క చిహ్నం. శిలలు, రాళ్ళు, మరియు విశాల దారు శిల్పములతో కూడిన ఈ భవనం హిమాచల్ యొక్క మహోన్నత మరియు మనోహర కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉంది. ఈ కోట తరువాత కాలంలో హోటల్ గా మార్చబడి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది.
రహ్లా జలపాతములు మనాలి నుండి 27కిలోమీటర్ల దూరంలో రోహతంగ్ కనుమ ఎక్కడానికి ప్రారంభంలో, సుందరమైన రహ్లా జలపాతాలు 2501మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
సోలంగ్ లోయ , స్నో పాయింట్ గా ప్రసిద్ధి చెందింది, మనాలికి వాయవ్యంగా 13 కిమీ దూరంలో ఉంది.
మనికరణ్ , కులు నుండి 45 కిమీ. దూరంలో మనాలి మార్గంలో పార్వతి నది సమీపంలో ఉన్న ఈ ప్రదేశం వేడి నీటిబుగ్గకు ప్రసిద్ధి చెందింది.
రోహతంగ్ , మనాలి నుండి 40 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందిన మంచు పడే ప్రాంతం, కానీ శీతాకాలంలో మంచు వలన మూయబడి ఉంటుంది.
పాండవ యువరాజు భీముని భార్య, స్థానిక దేవత హడింబ యొక్క ఆలయమైన హిడింబా దేవి ఆలయం 1553లో స్థాపించబడింది. ఈ ఆలయం దాని నాలుగు-అంతస్తుల గోపురం మరియు సున్నితమైన దారు చెక్కడాలకి ప్రసిద్ధి చెందింది.
పురాతనమైన జగన్నాధ దేవి ఆలయాన్ని 1500 ఏళ్ళ నాడు నిర్మించారని అంటారు. ఈ గుడి గోడల మీద శక్తి స్వరూపిణి దుర్గా దేవి చిత్రాలు చూడవచ్చు. ఈ గుడిని చేరుకోవాలంటే 90 నిమిషాల పాటు పర్వతారోహణ మార్గం గుండా ప్రయాణించాలి. శివుడి కోసం నిర్మించిన ఇక్కడి బసవేశ్వర దేవాలయం 9 వ శతాబ్దం లో నిర్మించారు. ఇక్కడి గుడి నిర్మాణం సంక్లిష్టమైన శిల్ప శైలికి పేరుపొందింది. కులు పర్యటించే వారు 180 జాతుల వన్య ప్రాణులున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ చూడవచ్చు.
వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా పర్యాటకులు కులు చేరుకోవచ్చు. కులు మనాలి విమానాశ్రయంగా పిలువబడే భుంటార్ ఇక్కడికి దగ్గరలోనే వుంది. కులు నగరం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ విమానాశ్రయం నుంచి డిల్లీ, షిమ్లా, చండీఘర్, పఠాన్ కోట్, ధర్మశాల లాంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి. విదేశాలకు విమానాలు నడిపే డిల్లీ ఇక్కడికి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం.
నగరం నుంచి 125 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి చండీఘర్ గుండా అనేక ప్రాంతాలకు రైళ్ళు నడుస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థ ద్వారా (హెచ్.పి.టి.సి) బస్సులు కులు నుంచి ఇతర సమీప నగరాలకు బస్సులు నడుపుతుండగా, హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అభివృద్ది శాఖ (హెచ్.పి.టి.డి.సి) చండీఘర్, షిమ్లా, డిల్లీ, పఠాన్ కోట్ లాంటి నగరాలకు కులు నుంచి డీలక్స్ బస్సులు నడుపుతుంది.
మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఈ పర్వత కేంద్రాన్ని సందర్శించడానికి అనువైన సమయం. బహిరంగ కార్యకలాపాలకు, స్థల సందర్శనకు మార్చ్ నుండి జూన్ నెలలు అనుకూలమైనవి కాగా జూన్ నుండి అక్టోబర్ వరకు రివర్ రాఫ్టింగ్, పర్వతారోహణ, హైకింగ్, ట్రెక్కింగ్ లాంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది.