రాజమండ్రి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టిసీమ లేదా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురుషోత్తమ పట్నం వరకు ట్రావెల్ ఏజెన్సీ లేదా APSRTC బస్సులు లేదా మినీ వ్యానుల్లొ ప్రయాణం చేస్తే అక్కడ నుండి గోదావరి నదిలో లాంచిలో పాపికొండలు యాత్ర మొదలౌతుంది. వీలైనంతవరకు ఉదయం 9:00 గంటల లోపుగా అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం లాంచీ లోనే లభ్యమౌతుంది.
గోదావరి నది మధ్యలో ఉండే పట్టిసం వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది. ఇక్కడ ఎన్నో తెలుగు సినిమాలు చిత్రీకరణ చేశారు. పురుషోత్తం పట్నం దాటినా తరువాత కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది. ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్సనం తరువాత మరల యాత్ర సాగుతుంది.
ఆ తరువాత వచ్చే దేవీ పట్నం గ్రామంలో అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే పోలీసు స్టేషన్లు కనిపిస్తాయి. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను.
యాత్ర ప్రారంభమైన ఐదు గంటలకు పాపికొండలు చేరుకుంటాము. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. వేసవి కాలంలోలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది.
పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి.
ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు
పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది.
నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్రంలో కలుస్తుంది. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండి రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.
రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపొతాయి. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది. అంతేకాక త్వరలోనే పాపికొండలు, ఆ కొండలమధ్యలో ప్రశాంతంగా ప్రవహించే గోదావరి అందాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ కారణంగా కనుమరుగు కాబోతున్నాయి.
పాపికొండలు దాటిన తరువాత సుమారుగా ఒక గంట ప్రయాణం తరువాత వచ్చే ప్రదేశం పేరంటాలపల్లి గ్రామం, ఇది గతంలో ఖమ్మం జిల్లాలో ఉంది కాని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చారు. భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు, ఇసుక తిన్నెలు, పిల్లలు, పెద్దలను కేరింతలు కొట్టిస్తాయి.
పేరంటాలపల్లి చేరుకోవటంతో యాత్ర ముగిసి తిరుగు ప్రయాణం మొదలౌతుంది. పట్టిసం నుండి పాపికొండలు యాత్ర, తిరుగు ప్రయాణం సమయం సుమారుగా 9:30 నుండి 10:00 గంటలు ఉంటుంది.
చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యో దయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్ఫైర్... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది.
తెలంగాణా రాష్ట్రం వైపు ఖమ్మం జిల్లా కూనవరానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోచవరం నుంచి లాంచీపై వెళితే రెండు గంటల్లో పేరంటపల్లి చేరుకోవచ్చు. ఖమ్మంజిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణదేవర, కనిష్క, అక్బర్ అనే పేర్లు ఉన్న మూడు లాంచీలు పాపికొండల వరకు తిరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహరాష్టల్రోని నాసిక్ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు.
AP Tourism one day package tour for Adults: Rs.600/- and Children: Rs.400/-
http://aptourismrajahmundry.com/papihills_oneday.html
Cont: +91 9397912351, 9397912411, 9494909399, 9290364666
3, 4 private tour operators are also conducting daily tours to Papikondalu from Rajahmundry.