తెలంగాణలో కాని, కర్ణాటకలో కాని, తమిళనాడులో కాని అసెంబ్లీ, సచివాలయాలు ఎన్ని ఎకరాల స్థలంలో ఉన్నాయో, పోనీ చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పే సింగపూర్ లో పార్లమెంట్, ప్రభుత్వ భవానాలు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయో చెప్పాలి. సింగపూర్ దేశ మొత్తం వైశాల్యం కేవలం 716 చదరపు కిలోమీటర్లు మాత్రమే అనే విషయం చంద్రబాబు నాయుడుకు తెలియదా?
రాజధాని కోసం మొదటి దశలో సేకరించే 35,000 ఎకరాల్లో ఏమేమి పనులు చేస్తారో ఒక 'బ్లూ ప్రింట్' ద్వారా ముందుగా ప్రజలకు చెప్పి ఉంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత ఉండేది కానీ, కొందరి స్వప్రయోజనాల కోసమే ఈ విధంగా అసలు విషయం రహస్యంగా ఉంచి వేల ఎకరాలు భూసేకరణ జరుపుతున్నారని అన్ని పార్టీలవారు, అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారు.
చంద్రబాబు నాయుడు రాజధాని మరియు ఔటర్ రింగురోడ్డు పరిధిని ప్రకటించక ముందు ఆ ప్రాంతం మరియు పరిసర ప్రాంతాల్లో గత నాలుగైదు నెలలుగా భూములు కొన్నవారి వివరాలు బహిర్గతం చేయగల ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అదే విధంగా చేస్తే ఈ కుంభకోణంలో లబ్దిపొందే బడా బాబుల వివరాలు ప్రజలకు తెలుస్తాయి.
కొత్త రాష్ట్రంలో అభివృద్ధి, పారిశ్రామికీకరణ వికేంద్రీకరణ జరగాలి కాని ఈ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమలన్నీ మొదట రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటుచేసి అక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వాగ్దానాలు చేస్తున్నాడు. అక్కడ భూములకు కోట్లు పరిహారం చెల్లించి, వారికి ఉద్యోగం, ఉపాధి మరియు కొన్ని ప్రత్యెక సదుపాయాలు కల్పించి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల వారికి అన్యాయం చేద్దామని ఈ మఖ్యమంత్రి భావిస్తున్నాడా? ఈ విధమైన చర్యలతో మిగిలిన ప్రాంతాల వారిలో అసంతృప్తి తలెత్తి మరోసారి ప్రాంతీయ విభేదాలకు దారితీస్తుంది.
ఈ రాష్ట్రంలో, అన్ని వర్గాలు, ప్రాంతాల వారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాడని, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలన చేస్తాడని భావించారు. అవినీతి పరుడైన జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడని, రాష్ట్రంలో మొత్తం సంపదను దోచుకుంటాడని భయంతో ఇప్పటివరకు ఎప్పుడు తెలుగుదేశానికి ఓటు చేయని కొన్ని వర్గాలు సైతం తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి గెలిపించారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, YSRCP కి ఓట్ల తేడా కేవలం 6,01,539 (2.6%) మాత్రమే అని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకొవాలి. చంద్రబాబు నాయుడు పై అభిమానంతో కాకుండా కేవలం జగన్ భయంతో తెలుగుదేశానికి ఓట్లు వేసిన వారి సంఖ్య 4% ఉంది. ప్రస్తుతం ఆ ఓటర్లు సైలెంట్ గా ఉన్నాకాని, జగన్ వైపు మొగ్గినా కాని తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం తప్పదు.
విశ్వసనీయత, పారదర్శకత లేనిదే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. రుణ మాఫీపై తోలి సంతకం చేసి, కమిటీలు మీద కమిటీలు వేసి కాలయాపన చేసిన ఈ ప్రభుత్వం ఆ తరువాత బడ్జెట్లో కేవలం 5,000 కోట్లు మాత్రమే రుణ మాఫీకి ప్రత్యేకించిందంటే ఆ సంతకాలు, కమిటీలు అవన్నీ కేవలం ప్రజలను మోసంచేయటానికేనా?
తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల వద్దకు ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి ఉంది. రుణ మాఫీపై అసలు పెట్టుకుని బ్యాంకులకు రుణాలను చెల్లించని రైతులకు పాత రుణాలపై చక్రవడ్డి భారంతో పాటు పంట పెట్టుబడులకు కొత్త ఋణం కూడా పొందలేని గడ్డు పరిస్థితి. బడా రైతులకు ఈ పరిస్థితి పెద్దగా బాధించక పోవచ్చు కాని, బక్క రైతులు మాత్రం ఈ ప్రభుత్వ నిర్వాహకంతో ఇంకా చిక్కిపోతున్నారు. చంద్రబాబు నాయుడు తీరు 'ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుండంట' అనే సామెతను గుర్తుకు తెస్తుందని రాజకీయ విశ్లేషకులు, ఆ పార్టీ నాయకులు సైతం భావిస్తున్నారు. ఇది మాటల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తక్కువ చెప్పి ఎక్కువ చేయటం మంచి రాజకీయ నాయకుడి లక్షణం. 'మాటలు కోటలు దాటించి, చేతలు గడప కూడా దాటించ లేకపోవటం' అసమర్ధ రాజకీయ నాయకుడి లక్షణం. రాజకీయాల్లో ఆత్మస్తుతి, పరనింద పనికిరాదు. ఆత్మ విమర్శ చేసుకోకపోవటం, నిర్మాణాత్మకమైన విమర్శలు, సలహాలు పెడచెవిన పెట్టటం సమర్ధుడైన రాజకీయ నాయకుడి లక్షణం కాదు.
ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడు నెలలే అయింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇకనుంచైనా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కోతల ప్రభుత్వంగా కాకుండా చేతల ప్రభుత్వంగా వ్యహరించి ప్రతి విషయంలో అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు సమానమైన న్యాయం చేస్తే కొత్త రాష్ట్రంలో ఎటువంటి ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా ఉంటాయి. చేసేదే చెప్పాలి! చెప్పిందే చేయాలి!! ప్రజలకు ఆశలు కాదు, నమ్మకం కల్పించాలి!
జై ఆంధ్రప్రదేశ్!!!