ఈ పరిస్థితి కి ముఖ్య కారణం అప్పట్లో విద్యా వ్యవస్థ బలంగా లేకపోవటమే. అప్పట్లో పల్లెటూళ్ళలో కేవలం ప్రాధమిక విద్య వరకు మాత్రమే అందుబాటులో ఉండేది, ఆ తరువాత మాధ్యమిక, ఉన్నత విద్య కోసం పట్టణాలకు వెళ్ళవలసి వచ్చేది, ఆర్ధిక పరిస్థితులు, రవాణా వసతులు సరిగా లేకపోవటం వలన ఎక్కువ కుటుంబాల్లో బాలికలకు ప్రాధమిక విద్య, బాలురకు మాధ్యమిక విద్య తోనే సరిపెట్టేవారు. ఈ కారణంతోనే తక్కువ వయస్సులోనే వివాహం జరిపించేవారు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది, కుటుంబ పెద్దగా తండ్రే ఉమ్మడి కుటుంబ పోషణ భారం వహించేవాడు. ఈ కారణం వలనే తక్కువ వయస్సులో వివాహం చేసుకొన్నా కాని ఆ పురుషులపై పోషణ భారం పడేది కాదు, వాళ్ళు కేవలం తండ్రికి చేదోడు వాదోడుగా మాత్రమే ఉండేవారు.
తరువాత కాలంలో విద్యా వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మాధ్యమిక, ఉన్నత విద్య కూడా గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి వచ్చింది, క్రమేణా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో కళాశాలలు ఏర్పాటయ్యాయి, శాస్త్ర, సాంకేతిక విద్య కూడా అందుబాటులోకి వచ్చింది. వీరేశలింగం గారి చొరవ, కృషితో విద్యనభ్యసించే స్త్రీల శాతం బాగా పెరిగింది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో మగ పిల్లలకు తమ శక్తి మేరకు ఖర్చు చేసి ఉన్నత విద్యలు చెప్పించటం ప్రారంభం అయ్యింది. 'ఉద్యోగం పురుష లక్షణం' అనే నానుడి అప్పటి నుండే ప్రాచుర్యంలోకి వచ్చింది.
విద్యా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందటంతో క్రమేణా కనిష్ట వివాహ వయస్సు పరిమితి పెరుగుతూ వచ్చింది.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న రోజుల్లో తక్కువ వయస్సులోనే వివాహం అయిన బాలికలు 'వివాహ బంధం', 'లైంగిక విషయాల' పైన ఏమాత్రం అవగాహన లేకుండానే కాపురం చేయటానికి సిద్ధమయ్యెవారు. వీరికి ఆర్ధిక సమానత్వం, స్వాతంత్రం ఉండేది కాదు, మామగారే కుటుంబ పెద్దగా వ్యహరించటం, భర్త పాత్ర నామ మాత్రంగా ఉండటం వలన వీరికి కుటుంబ పెత్తనం, ఆర్ధిక వ్యహారాల్లో స్థానం ఉండేది కాదు, అత్తల చాటు కాపురం చేయ వలసి వచ్చేది. కొన్ని కుటుంబాల్లో భర్తల దురలవాట్లు, అత్తల ఆరళ్ళు, తోడికోడళ్ళ సాధింపులు, ఆడపడుచుల వేధింపులు భరిస్తూ కాపురం చేసేవారు.
సంసార బంధంలో భర్త నుండి కానీ, భర్త వైపు వారినుండి కాని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా భరిస్తూ కాపురం చేసేవారు, ఒకవేళ తల్లి తండ్రులకు చెప్పినా ఏదోవిధంగా సర్దుకుపొమ్మని సలహా ఇచ్చేవారు లేదా ఏదో రకంగా ఇరువురికి ఇబ్బంది కలుగ కుండా, పరువు రోడ్డున పడకుండా పరిష్కారం చేసేవారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో విడాకులు, భార్య భర్తలు విడి విడిగా ఉండటం అంటే ఎంతో అవమానకరంగా, పరువు తక్కువగా భావించేవారు. తల్లి తండ్రులు, మధ్యవర్తులు ఎంత పెద్ద కుటుంబ సమస్య అయినా ఏదో రకంగా సర్ది చెప్పి విడాకుల వరకు వెళ్ళకుండా పరిష్కరించే వారు. స్త్రీ ఆర్ధికంగా బలహీనురాలు కావటం, సమాజంలో విడాకులు తీసుకున్న స్త్రీ పట్ల చిన్న చూపు ఉండటం వలన కూడా ఎన్ని కష్టాలు, ఇబ్బందులు పడినా ఒక రకంగా స్త్రీలే సర్దుకు పోయేవారు.
కాలక్రమేణా సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా స్త్రీలకు రాజ్యాంగంలో కొన్ని ప్రత్యెక హక్కులు, అధికారాలు కల్పించబడ్డాయి. తండ్రి ఆస్తిలో పురుషులతో సమానంగా స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించారు, స్త్రీ విద్యను ప్రభుత్వం ప్రోత్సహించింది, చదువుల్లో, ఉద్యోగాల్లో స్త్రీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈ కారణాల వలన స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్రం, స్వావలంబన ఏర్పడింది.
ఇదే సమయంలో 'ఉమ్మడి కుటుంబ' వ్యవస్థ విచ్చిన్నమై విడి కుటుంబ (Nuclear family) వ్యవస్థ ఏర్పడింది. కొత్త పెళ్ళైన భార్యా భర్తలకు మంచి చెడు చెప్పే వారు, చిన్న చిన్న తగాదాలు తీర్చే వారే కరువయ్యారు. ఉద్యోగ రీత్యా తమ తల్లి తండ్రులకు దూరంగా ఉండే కుటుంబాలకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.
ఈ మధ్య కాలంలో పురుషులలో 'పురుషాధిక్య' ధోరణి తగ్గి ఉద్యోగం, వ్యాపకాల మీద, కెరీర్ మీద ఎక్కువగా దృష్టి పెడ్తున్నారు, కానీ ఉద్యోగం చేసే కొంత మంది స్త్రీలలో 'స్త్రీవాద' (Feminist) ధోరణి ఎక్కువైంది. అలాగని ఉద్యోగం చేయని వాళ్ళేమీ తక్కువ తినలేదు, కొంతమంది స్త్రీలు తమ కోరికలు తీర్చుకోవటానికి భర్తలను రాచి రంపాన పెడ్తున్నారు.
అత్తా, ఆడపడుచు ఆరళ్ళు లేని కుటుంబంలో స్త్రీలు కూడా కొంతమంది అత్త మీద ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నారు, వీరికి వాళ్ళ తల్లులు తోడవుతున్నారు. కొడుకు ఇంటికి వెళ్ళే తల్లి తండ్రులు ఏదో చుట్టపు చూపుగా వెళ్తున్నారు కాని అల్లుడి ఇంటికి వెళ్ళే అత్తా, మామలు అధికారంతో వెళ్తున్నారు. పండుగలకు, సెలవలకు అత్తగారింతో రెండు రోజులైనా గడపాలంటే చాలా మంది కోడళ్ళకు కుదరదు కానీ కన్నవారింట్లో మాత్రం ఎన్ని రోజులైనా గడిపేస్తారు. కోడళ్ళు సరిగా చూడకపోవటం, పట్టించుకోవపోవటం కారణంగానే ఈ రోజుల్లో 'ఓల్డ్ ఏజ్ హోములలో' చేరే వారి సంఖ్య ఎక్కువైంది.
గతంలో కాపురాల్లో వచ్చే గొడవల్లో ఎక్కువగా స్త్రీలే భాదితులుగా ఉండేవారు, కాని ప్రస్తుత సమాజంలో 'భార్యా భాదితులే' ఎక్కువగా ఉన్నారు. దీనంతటికి ముఖ్య కారణం: స్త్రీలకున్న కొన్ని ప్రత్యేకమైన హక్కులు, ఆర్ధిక స్వతంత్రం, స్త్రీలకు అనుకూలంగా ఉన్న వివాహ చట్టాలు.
భార్య భర్తల మధ్య ఏర్పడిన చిన్న చిన్న కలహాలు కూడా విడాకుల వరకు దారి తీస్తున్నాయి. పురుషులు శారీరకంగా బలవంతులైనా కాని స్త్రీలు మానసికంగా పురుషుల కంటే ఎంతో బలవంతులు. చాలా సందర్భాల్లో భర్తలే సర్దుకుపోటానికి సిద్ధపడుతున్నా భార్యలు మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోవటం లేదు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకొనే వరకు, పంతం తీర్చుకోటానికి ఎంతవరకైనా వెళ్తున్నారు.
సహనానికి, కరుణకు మారుపేరు 'స్త్రీ' అంటారు కానీ, నేటి స్త్రీలలో కొంత మంది సహనం అనే పదానికి అర్ధం మర్చిపోయి పంతం, పగ, ప్రతీకారం తీర్చుకోటానికి మొండితనంతో ఎంతకైనా తెగిస్తున్నారు, కాపురాలను నాశనం చేసుకుంటున్నారు.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, కాపురంలో ఏర్పడే కలహాల్లో భార్య, భర్తల ఇద్దరి పాత్ర ఉంటుంది, కాకపొతే ఒకరిది ఎక్కువ, ఇంకొకరిది తక్కువ. తప్పెవరిదైనా భార్య, భర్తలిద్దరూ సర్దుకుపోతే చాలా మంచిది, లేదా ఒకరు సర్దుకున్నా కాని సమస్య జటిలం కాకుండా ఉంటుంది. భార్య, భర్తల మధ్య సమస్య పరిష్కారం కానప్పుడు మొదటగా ఇరువురి తల్లి తండ్రుల సమక్షంలో తీర్చుకోవటం మంచిది. అప్పటికి పరిష్కారం కాని పక్షంలో ఇరువురికి కావలసిన బంధువులో, స్నేహితులో సహకారం తీసుకోవటం మంచిది. అలా కాకుండా ఈ మధ్య కాలంలో చాలా సందర్బాలలో స్త్రీలు కేవలం తమ తల్లి, తండ్రుల సలహాలపైనే ఆధారపడి తమ భర్తను, అత్తా, మామలను అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెద్ద పెద్ద కారణాలు ఉన్నప్పుడు విడాకులే శరణ్యం, కానీ చిన్న చిన్న కారణాలతో తమ కూతురు ఒంటరిగా ఉండటానికి, విడాకులు తీసుకుని కాపురం నాశనం చేసుకోటానికి చాలా మంది తండ్రులు ఒప్పుకోరు కాని, ఈ విషయంలో వారి మాట చెల్లుబాటు కావటం లేదు, చాలా కుటుంబాల్లో తల్లుల ప్రమేయంతోనే ఆడ పిల్లలు మొండితనంగా వ్యహరిస్తున్నారు.
విడాకులు తీసుకున్న, విధవలైన తల్లుల పరిస్థితి మరీ దారుణం, వాళ్ళు కొడుకు, కోడలితో కలిసి ఉండలేరు, కూతురి దగ్గర చేరి తప్పుడు సలహాలిచ్చి, చెప్పుడు మాటలు చెప్పి ఆమె సంసారం, అల్లుడి మీద ఆజమాయషి తమ చెప్పు చేతల్లో ఉండాలనుకొంటారు. అల్లుడు మెతక వాడితే పర్లేదు కానీ, ఆత్మాభిమానం ఉన్నవాడైతే కనుక అతనిపై పగ బట్టినట్టుగా వ్యవహరించి కూతురి సానుభూతిని అవకాశంగా మలచుకొని కాపురంలో కలతలు సృష్టించి వారి సంసార బంధం విచ్చిన్నం అవటానికి కారకులు అవుతున్నారు.
పెళ్ళైన కొద్ది కాలంలోనే విడాకులు తీసుకున్న స్త్రీలు, పిల్లలు లేని వారికి రెండో పెళ్లి విషయంలో కొంత సానుకూల అవకాశం ఉన్నా, తల్లి, తండ్రుల తప్పుడు సలహాలతో లేటు వయసులో విడాకులు తీసుకున్న స్త్రీలు, పెద్ద పిల్లలున్నవారికి ఆ వయసులో రెండో పెళ్ళికి అవకాశాలు బాగా తగ్గి పోతున్నాయి, తోడు అవసరం అయిన వయస్సులో వారు ఒంటరిగా మిగిలిపోతున్నారు. విడాకులు తీసుకున్న వారి పిల్లకు ఈ సమాజంలో 'పెళ్లి' విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి, కానీ ఇవేమీ ఆలోచించకుండా విడాకులు తీసుకొనే స్త్రీలు, వాళ్ళ తల్లి తండ్రులు వాళ్ళ బిడ్డల జీవితం నాశనం చేస్తున్నామనే విషయం కూడా గుర్తించటం లేదు. భర్త చనిపోయిన వారిపట్ల సానుభూతి చూపించే ఈ సమాజం 'విడాకులు' తీసుకున్న వారి పట్ల కొంత చులకన భావంతో ఉంటుంది.
ఇక్కడ నేనెవ్వరిని వెనకేసుకు రావటం లేదు, మగ పిల్లల తల్లి తండ్రుల్లో కూడా కాపురాలు చెడగోట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఆడవాళ్ళకు అనుకూలంగా ఉండే 498 వంటి చట్టాలను చూసి కొంత వెనుకంజ వేస్తున్నారు. అవే చట్టాలను అలుసుగా తీసుకుని కొంతమంది ఆడపిల్లలు వారి తల్లి తండ్రులు అబద్ధపు కేసులతో మగపిల్లల తల్లి తండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో కుటుంబ న్యాయస్థానం (ఫ్యామిలీ కోర్ట్) న్యాయమూర్తుల, కుటుంబ సలహాదారుల (ఫ్యామిలీ కౌన్సిలర్స్) పరిశీలన ప్రకారం విడాకులలో ఎక్కువ భాగం అహం (ఇగో) , పంతాలు, పట్టింపుల వంటి చిన్న చిన్న కారణాల వల్లనే అని, స్త్రీల పాత్ర, వారి తల్లుల పాత్రే ఎక్కువగా ఉంటుందని విశ్లేషించారు. చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం న్యాయస్థానం మెట్లెక్కే భార్య, భర్తలతో పాటుగా వారి తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ అవసరమని కూడా భావిస్తున్నారు.
ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాలు తెలియచేయగలరు.