సత్యం కుంభకోణంలో 2,000 కోట్లు దోచిన పెద్దమనుషులకు కేవలం 10 లక్షల జరిమానా, 6 నెలల కారాగార శిక్ష విధించిన కోర్టు తీర్పు నిజంగా ఈ దేశ యావత్ ప్రజానీకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. వేయి రూపాయలు లంచం తీసుకున్న ఉద్యోగికి, పది వేలు దొంగతనం చేసిన దొంగకి, లక్ష రూపాయలు మోసం చేసిన మోసగాడికి, వందల కోట్లు అక్రమంగా దోచుకుని, కంపెనీ నష్టాలకు భాద్యుడై, తన కంపెనీలో లక్షల మంది వాటాదారుల (షేర్ హోల్డర్ల) వేలకోట్ల రూపాయల సంపదను దారుణంగా నష్ట పరచిన రామలింగ రాజు అండ్ బ్రదర్స్ కు ఒకే రకమైన శిక్ష విధించటం ఏమి న్యాయం?
ఈ తీర్పు కార్పొరేట్ మోసగాళ్ళ మోసాలకు మరింత ఊతమిచ్చేదిగా ఉంది.. ఈ దేశంలో పేద వాడికి ఒక న్యాయం, పెద్దోడికి ఇంకో రకమైన న్యాయమని మరో సారి నిరూపితమైంది.. చిన్న చిన్న నేరాలు చేసి జైలుకెళ్ళిన వారి కుటుంబాలు, సంపాదించే వ్యక్తిని కోల్పోయి ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సత్యం స్కాంలో సర్వం కోల్పోయిన మదుపరుల కష్టాలు తీర్చే నాధుడు లేడు... కానీ సత్యం రాజుగారి కుటుంబం ఇంకా రాజ భోగాలు బాగానే అనుభవిస్తున్నారు. రేపు రామలింగరాజు కోర్టులో అప్పీలు చేసుకుంటే.. ఈ పేద రాజు గారికి ఇంత పెద్ద శిక్షా! అని కేసును కొట్టేసినా కొట్టేయోచ్చు. గతంలో ఒక సందర్భంలో ఆర్ధిక నేరాలు హత్యా నేరం కంటే తీవ్రమైనవని తీర్పు ఇచ్చిన సుప్రీమ్ కోర్టు రాజుగారి విషయంలో మినహాయింపులు ఇవ్వవచ్చు... ఈ తీర్పు మరొక ఆర్ధిక నేరస్తుడు 'జగన్'కు ఎంతో సంతోషం కలిగించి ఉండవచ్చు. నిజంగా! చట్టానికి కళ్లులేవు తమ్ముడూ!!