నిన్నటి వరకు భాజపా ఆంధ్ర ప్రదేశ్ లో 'పవన్ కళ్యాణ్' వచ్చే ఎన్నికల్లో తమ ప్రచార భాద్యతను నెత్తిన వేసుకుంటాడని, తెలుగుదేశం పార్టీ అలయన్స్ లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చని, ఒకవేళ పొత్తు బెడిసి కొడితే మహారాష్ట్ర లో జరిగినట్లుగా ఒంటరిగా పోటీచేసినా అతని సారధ్యంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని ఆశ పెట్టుకుంది.
ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ, రాష్ట్రంలో వెంకయ్య నాయుడు వెనుదన్నుతొ బిజెపి శ్రేణులు 'పవన్ కళ్యాణ్' కు అమిత ప్రాదాన్యతనిచ్చి భుజానికెత్తుకున్నారు. 'గంటా శ్రీనివాస రావు' లాంటి 'జంప్ జిలానిలు' కూడా తమ ప్రైవేటు సంభాషణల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి పవన్ కళ్యాణ్ సారధ్యంలో పనిచేస్తే తమకు లాభం ఉంటుందని లెక్కలు కూడా వేసుకుంటున్నారట.
డిల్లీ ఎన్నికల్లో కిరణ్ బేడిని తమ పార్టీలో చేర్చుకుని ప్రధాన ఎన్నికల ప్రచారకర్తగా, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన బిజెపి గతంలో ఎన్నడు లేని విధంగా ఎన్నికల్లో అతి దారుణంగా ఓడిపోయింది. సంవత్సరం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, గత మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డిల్లీలో ఆధిక్యతను సాధించి, ఇప్పుడు జరిగిన ప్రీ ఎలక్షన్ సర్వేల్లో కూడా ముందున్న భాజపా, కిరణ్ బేడి ప్రచార సారధ్యంలో ఎన్నికల ఓటింగ్ సమయం దగ్గరయ్యే సమయానికి క్రమక్రమంగా తన ఆధిక్యాన్ని కోల్పోయి చివరకు ఆమ్ అద్మి పార్టీ చేతిలో అత్యంత అవమానకరమైన రీతిలో ఓటమి చవి చూసింది.
ప్రజాదరణ విషయంలో చూస్తే 'పవన్ కళ్యాణ్' కంటే 'కిరణ్ బేడి' చాలా ముందుంది, అటువంటి కిరణ్ బేడి సారధ్యంలో దిల్లీలో బిజెపి మట్టి కరిచి పోయిందంటే ఇక పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని తెలుగుదేశం పార్టీని దూరం చేసుకుంటే 'ఉన్నది పోయే! ఉంచుకుంది పోయే' అనే చందంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పార్టీ పరిస్థితి తయారవుతుందేమోనని మళ్లీ బిజెపి అధిష్టాన వర్గం పునరాలోచన చేస్తుందట.
పవన్ కళ్యాణ్ ను నెత్తినెక్కించుకున్న బిజెపి మారుతున్న రాజకీయ నేపధ్యంలో సేఫ్ గేమ్ లో భాగంగా మరల టిడిపి తో దగ్గరవ్వాలనే యోచనతో, మరియు తెలంగాణలో తెరాస పార్టీతో కొత్త స్నేహానికి తెరతీస్తూ కెసిఆర్ బద్ధ శత్రువు పవన్ కళ్యాణ్ ను కొంత దూరంగా ఉంచాలని యోచిస్తుందట. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదని మరో సారి బిజెపి విషయంలో ఋజువైంది.
ఇప్పటికే ప్రధాని మోడీ, వెంకయ్య నాయుడు మొదలైన వారు గత పార్లమెంట్ ఎన్నికల్లో తమకిచ్చిన వాగ్దానాలు అమలు చేయటంలేదని 'బిజెపి' పై ఆగ్రహంతో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, పవన్ కళ్యాణ్ కనీసం ఈ విషయమై ప్రధాని మోడిని కాని, వెంకయ్య నాయుడు వంటి వారిని కాని నిలదీయక పోగా, వారితో మమేకమై పైరవీలు చేయించుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రాఫ్ ను నేలకు తీసుకు వచ్చాయి.
ప్రస్తుత పరిస్థితులు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా అత్యంత అననుకూలంగా ఉండటంతో అతను ఒకరకమైన రాజకీయ నైరాశ్యం ప్రదర్శిస్తున్నాడని అతనికి అత్యంత సన్నిహితులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.