జయప్రకాశ్ నారాయణ గతంలోకి వెళ్తే కొన్ని విషయాలను పరిశీలిద్దాం.
స్వతహాగా మంచి ఆదర్శ భావాలు కలిగిన ఈయన కలెక్టర్ గా చాలా సమర్ధవంతంగా, ఎంతో నీతి, నిజాయితీ, నిబద్ధతలతో పనిచేసి ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవినీతికి ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరువగా తెచ్చి, ఆ ఫలాలు వారికి చేరే విధంగా ఎంతో శ్రమించాడు.
'రాజకీయ నాయకుల' జ్యోక్యం అపరిమితంగా ఉన్నఈ పరిపాలనా వ్యవస్థలో ఇమడలేక తన పదవికి రాజీనామా చేసి ప్రజా చైతన్య ఉద్యమాన్ని ప్రారంభించే ప్రయత్నంలో భాగంగా లోక్ సత్తాను స్థాపించాడు. క్రమేపి ఈ ఉద్యమం విద్యావంతులను, యువతను బాగా ఆకర్షించింది. ప్రజలలో తమ హక్కుల పట్ల, ప్రభుత్వ జవాబుదారి తనం పట్ల కొంతవరకు ఆలోచన రేకెత్తించి లోక్ సత్తా ఉద్యమం బాగానే బలపడింది.
లోక్ సత్తా ని ప్రజా ఉద్యమం వైపు నుండి రాజకీయ పార్టీగా మార్చివేసిన జయప్రకాశ్ నారాయణ 'విద్యావంతులు, యువకులు, మహిళల' సహకారంతో ఎన్నికలలో గణనీయంగా సీట్లు సంపాదించి రాజకీయాలలో ఒక కీలక వ్యక్తిగా ఎదగాలనుకున్నాడు.
లోక్ సత్తాలో రాజకీయాలంటే గిట్టని కొంతమంది జయప్రకాష్ నారాయణ పోకడలు నచ్చక బయటికి వచ్చారు. ఈయన రాజకీయాల్లో యేవో పెనుమార్పులు తెస్తాడని, సమాజాన్ని తెగ ఉద్దరిస్తాడని భావించిన చాలా మంది ఈయనకు మద్దతిచ్చారు.
ఈయనకు లభిస్తున్న ప్రజా స్పందన గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈయనను చల్లబరిచే క్రమంలో భాగంగా The National Advisory Council (NAC) for the implementation of the National Common Minimum Programme (CMP), మరియు National Rural Health Mission of India Task Force, సభ్యుని పదవి కట్టబెట్టింది. ఈ క్రమంలో ఈయనలో పక్కా రాజకీయ నాయకుడు ప్రాణం పోసుకున్నాడు. అప్పటినుండి కేంద్ర ప్రభుత్వాన్ని, మన్మోహన్ సింగు ను, సోనియా గాంధీని పోగడటమే పనిగా పెట్టుకున్నాడు.
రాజశేఖర రెడ్డి విసిరేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడిన జయప్రకాశ్ నారాయణ కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డికి అన్ని సందర్బాలలో అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలకు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అన్ని సందర్బాలలో వ్యతిరేకంగా వ్యవహరించటం మొదలుపెట్టాడు. 'గాలి జనార్ధన రెడ్డి', 'జగన్' కంపెనీల విషయంలో, 'జలయజ్ఞం' అవినీతి లో ఈయన ఎప్పుడు ప్రతిపక్షాలతో చేతులు కలపలేదు.
రాజశేఖర రెడ్డి బతికుండగా ఆయన అవినీతిని ఈయన ఏనాడు ప్రశ్నించలేదు సరికదా, కనీసం ప్రతిపక్షాల ఆందోళనలకు కూడా ఈయన ఏనాడు మద్దతు తెలియచేయలేదు. ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి 'చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీ' కి వ్యతిరేకంగా ఈయనను ఒక పావుగా ఉపయోగించుకున్నాడు.
2009 అసెంబ్లీ ఎన్నికలలో 'కాంగ్రెస్' పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా ఆర్ధిక ఒప్పందం కుదుర్చుకున్న జే.పి, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండి, గెలిచే ఆవకాశం ఉన్న, ఆ పార్టీ తరుపున 'కమ్మ' సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిలబడి కాంగ్రెస్ పార్టీ తరుపున 'నాన్ కమ్మ' పోటీచేసిన కనీసం 10 నియోజక వర్గాలలో లోక్ సత్తా పార్టీ తరుపున 'కమ్మ' సామాజిక వర్గానికి చెందిన వారికే సీట్లిచ్చి, తద్వారా 'కమ్మ' సామాజిక వర్గం వారి ఓట్లలో చీలిక తెచ్చి, అతి తక్కువ వోట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గాలలో గెలవటానికి, ప్రధాన కారకుడయ్యాడు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే విద్యావంతుల ఓట్లలో కూడా చీలికె తెచ్చి తన పార్టీ గెలవలేకపోయినా 'తెలుగుదేశం పార్టీ' ఓటమికి కారకుడయ్యాడు.
కాంగ్రెస్ పార్టీ తో ఈయన చేసుకున్న ఒప్పందం ప్రకారం, కనీసం 20 పైగా స్థానాలలో 'తెలుగుదేశం' పార్టీని దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు, తద్వారా 'అరాచక' రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారాన్ని చేజిక్కించు కోవటానికి 'జయప్రకాశ్ నారాయణ' సహాయం చేసాడు, ఆయన ఋణం తీర్చుకున్నాడు.
పై ఆరోపణలు నిజం కావంటూ 'జయప్రకాశ్ నారాయణ' అడ్డంగా కొట్టివేస్తాడు. కాని ఆయన ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సూటిగా జవాబులు చెప్పాలి!
1) భారత ప్రజాస్వామ్యంలో వోటు హక్కు కలిగిన వ్యక్తి ఈ దేశంలో ఏ ప్రదేశంలో నివసిస్తున్నా, మరే ప్రదేశం నుండైనా ఎన్నికలలో పోటి చేయవచ్చు, అదేమీ తప్పు కాదు. కాని, జయప్రకాశ్ నారాయణ తను నివాసం ఉంటున్న 'జూబిలీ హిల్స్' లేదా 'ఖైరతాబాద్' నుండి పోటి చేయవచ్చు, కాని 'కుకట్ పల్లి' నియోజకవర్గాని ఎన్నుకోవటానికి గల కారణాలను ఆయన నిజాయితీగా బహిర్గతం చేయాలి? (ఈ నియోజక వర్గం ఓటర్లలో 'కమ్మ వారు' అత్యధికంగా ఉండటం, ఆ నియోజకవర్గం లో 'తెలుగు దేశం' పార్టీ పోటి చేయకపోవటమే మీరు ఆ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవటానికి ముఖ్య కారణం తప్ప మరే కారణం లేదనే విషయం ఇక్కడ ఎవరూ కాదనలేని 'నగ్న సత్యం').
2) మీ పార్టీ కార్యకర్తలు, మీ భార్య 'కుకట్ పల్లి' ప్రాంతంలో 'తెలుగుదేశం' పార్టీ కార్యకర్తలను, 'కమ్మ సామాజిక వర్గ' వోటర్లను, ఆంధ్ర ప్రాంతం సెటిలర్స్ ను 'కులం' పేరు, ప్రాంతం పేరు ఉపయోగించి ఓట్లు అడుక్కోవటం నిజం కాదా?
3) 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికి మీరు రూ. 90 కోట్లకు బేరం కుదుర్చుకున్న విషయం వాస్తవం కాదా?
4) ఏదో ఒక విధంగా మీరు 2009 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి మీ చిరకాల వాంఛను నెరవేర్చు కున్నారు. అసెంబ్లీ లో 'రాజశేఖర రెడ్డికి' అన్ని విధాలుగా భజన చేసారు. అసెంబ్లీ ఎన్నికల వెంటనే వచ్చిన 'GHMC' (కార్పోరేషన్). ఎన్నికలలో 'కుకట్ పల్లి' నియోజక వర్గంలో మీ పార్టీ 'కార్పొరేటర్' అభ్యర్ధులని చిత్తు, చిత్తుగా ఓడించి, డిపాజిట్లు గల్లంతు చేసారు కుకట్ పల్లి ఓటర్లు.
రాజకీయాలలో, రాజకీయ నాయకులలో నీతి, విలువలు ఉండాలని, వోటర్లకు తమకు నచ్చని ప్రతినిధులను 'రీ కాల్ ' చేయాలని ఊక దంపుడు ఉపన్యాసాలిచ్చే మీరు, 'కుకట్ పల్లి' నియోజకవర్గ ఓటర్లు మీకు, మీ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఎందుకు రాజీనామా చేయలేదు? మీరు యమ్.యల్.ఏ గా ఎన్నికైన ఆరు నెలల్లోనే మీ పనితీరు పట్ల, మీ పార్టీ పట్ల మీ నియోజకవర్గ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందంటే మీకు జవాబుదారి తనం లేదా?
మీ విషయంలో కూడా 'ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి' అని జనం భావించాలా?
మీ పట్ల, మీ పార్టీ పట్ల ఎంతో విశ్వాసం ఉంచి గత ఎన్నికలలో వోట్లు వేసిన సామాన్య ప్రజానీకం, యువత మీ నిజ స్వరూపం తెలుసుకుని తమ అమూల్యమైన వోటును వృధా చేసుకున్నందుకు తరువాత ఈ విధంగా మీ నియోజకవర్గంలో మీ పార్టీని చిత్తుగా ఓడించి అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.
5) మీరెప్పుడు అదేపనిగా విమర్శించే 'తెలుగుదేశం' పార్టీ , చంద్రబాబు నాయుడుని 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 'మల్కాజిగిరి' పార్లమెంట్ సీటు కోసం అడుక్కోవటం, వామపక్షాలు, బిజెపి వారితో పైరవీలు చేయించటం వాస్తవం కాదా?
6) భూమా శోభ మరణించి ఉప ఎన్నికలు జరిగిన 'ఆళ్లగడ్డ' లో వై.సి.పి పై పోటి పెట్టకుండా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన మీరు 'తిరుపతి' లో వెంకట రమణ మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో 'తెలుగుదేశం' పార్టీపై అభ్యర్ధిని ఎందుకు నిలబెట్టారు. (2014 ఎన్నికల్లో అక్కడ మీ పార్టీ అభ్యర్ధి కేవలం 2210 ఓట్లు మాత్రమె పొందాడు, అక్కడ మీ బలం శూన్యం) 'ఆళ్లగడ్డ' ఉప ఎన్నికల్లో మీ పార్టీ పోటి చేయకుండా ఉండేందుకు మీకు జగన్ తో ఎంతకు బేరం కుదిరింది.
దిల్లీలో కేజ్రివాల్ గెలవగానే వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా ఫలితాలు ఇదే విధంగా ఉంటాయని 'లోక్ సత్తా' పార్టీ తన ప్రతాపాన్ని చూపిస్తుందని మీరు కనే కలలు "ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందంట" అనే సామెత గుర్తుకు తెస్తుంది. కేజ్రివాల్ కు మీకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, దిల్లీలో 'ఆమ్ ఆద్మీ' పార్టీకి బిజెపి, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మంది సభ్యులున్నారు., ఆ పార్టీ బలం రోజు రోజుకి పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మీ పార్టీ సభ్యుల సంఖ్య ఎంత, గతంలో పోల్చుకుంటే మీ పార్టీ సభ్యుల సంఖ్య యెంత తగ్గింది! ఎందుకు తగ్గింది? మీ పార్టీలో పదవి విరమణ చేసిన ప్రభుత్వాధికారులు కాని, విద్యా వేత్తలు కాని, సంఘ సేవకులు కాని ఎవరైనా ఉన్నారా? మీ పార్టీలో కర్త. కర్మ, క్రియ... అన్నీ మీరే!
రాజకీయాలను వ్యాపారంగా మార్చి అధికారం లోకి రాకుండానే లబ్ది పొందిన వారిలో ప్రధముడు 'చిరంజీవి' ఐతే రెండో వ్యక్తి మీరే అని జనమంతా అనుకుంటున్నారు జయప్రకాశ్ గారూ!.
ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది, కాని అది సూటిగా, సహేతుకంగా ఉండాలి. కానీ ఏదో ఒక డొంక తిరుగుడు సమాధానం చెప్పి తప్పించుకోవాలనుకుంటే మాత్రం విలువ తగ్గిపోతుంది.