'తెలంగాణాకు' మద్దతిస్తే 'జెముడు కుక్కనైనా' ముద్దు పెట్టుకుంటానని ప్రకటించి, 'తెలంగాణాకు' మద్దతుగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని మాత్రం అడుగడుగునా విమర్శించాడు. 'తెలంగాణా' రాష్ట్రం ఇస్తే తెరాస పార్టీని 'కాంగ్రెస్ పార్టీ'లో విలీనం చేస్తానని మాట ఇచ్చిన కెసిఆర్ ఆ తరువాత తానెప్పుడు ఆ విధంగా అనలేదని మాట మార్చాడు.
తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలిసి 'తెలంగాణా' స్వప్నం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వలెనే సాధ్యమైందని ప్రకటించి వారం రోజులు తిరగకముందే తాము కోరుకున్నది ఈ తెలంగాణా కాదని, అంక్షలు లేని తెలంగాణా అని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను మోసం చేసిందని, సోనియా గాంధీ పై కూడా విమర్శలు చేశాడు. అసలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇవ్వటం ఇష్టం లేకే ఇంతకాలం నాన్చిందని, తన పోరాటం వలనే 'తెలంగాణా' రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని ప్రకటించాడు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో కూడా కృతఘ్నుడిగా మారి కాంగ్రెస్ పార్టీ నాయకులను తన పార్టీలోకి చేర్చుకోవటమే కాకుండా, కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎన్నో రకాలుగా విమర్శించాడు.
తను తెలంగాణా ద్రోహులుగా ముద్ర వేసిన వారికే 2014 ఎన్నికల సమయంలో సీట్లిచ్చి ఆ తరువాత వారిలో కొందరిని మంత్రులుగా కూడా చేశాడు. 2014 ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన తరువాత 'దళిత ముఖ్యమంత్రి' హామీని విస్మరించి తనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు.
తెలంగాణా అమరవీరుల కుటుంబ సభ్యులకు ఎన్నికల్లో సీట్లిస్తానన్న హామీని విస్మరించి కేవలం ఖచ్చితంగా ఓడిపోయే సీటు మాత్రమే ఒక్కరికి కేటాయించి చేతులు దులుపుకున్నాడు, ఖచ్చితంగా గెలిచే సీట్లు అమ్మేసుకున్నాడు.
సెటిలర్స్ అన్న పదం మొదటగా వాడింది, తెలంగాణా ప్రజలను ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది చంద్రశేఖర రావే. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రులను 'దోపిడీ దారులు' గా ముద్ర వేసి మోటు పదాలు ఉపయోగించి మొరటు వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ తెలంగాణలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకున్నాడు.
అదే కెసిఆర్, ఇప్పుడు "తెలుగువారి మధ్య విభేదాలేమీ లేవు. హైదరాబాద్లో బతుకుతెరువు కోసం వచ్చినవారి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీరు ధైర్యంగా ఉండండి. నిర్భయంగా తిరగండి. మీ (సెటిలర్ల) కాలికి చీమ కుడితే నా కాలుకు ముల్లు గుచ్చుకున్నట్టు బాధపడతాను. మీ కాలికి ముల్లు దిగితే పంటితో తీసేస్తాను" అని వ్యాఖ్యానించారు. అయినా, హైదరాబాద్లో స్థిరపడినవారెవరూ సెటిలర్స్ కాదని ఇక్కడ నివాసం ఉండేవారంతా హైదరాబాదీలేనని ఏ మట్టిలో పుట్టినవారు ఆ ప్రాంతానికి చెందుతారని చెప్పుకొచ్చారు.
ఈ వాఖ్యలన్ని రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్నారా! లేక నిజంగానే కెసిఆర్ హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతం వారి పట్ల తన వైఖరిని మార్చుకున్నారా!! అనే విషయం గ్రేటర్ ఎన్నికలు జరిగిన తరువాత మాత్రమే తెలుస్తుంది. 'యేరు దాటాక తెప్ప తగలేసే' గుణం మెండుగా ఉన్న కెసిఆర్ మాటలు నమ్మాలంటే కొంత కష్టమే! కానీ.. తప్పదు... మనం ఆశావాదులం కదా!