ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగ వంశ రాజుల ఆధీనంలోకి మారాయి. తరువాత 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్థనుడి స్వాధీనంలో ఉన్నాయి. చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చి, 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు అప్పగించబడ్డాయి.
పక్కనే ఉన్న కోయంబత్తూర్ ప్రావిన్సు కు గవర్నరుగా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం, మరియు అడవులను చూసి ముచ్చటపడి, అక్కడ నివసిస్తున్న కోయజాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొన్నాడు.
నెమ్మదిగా ఈ స్థలాలు ఆంగ్ల ప్రైవేటు వ్యక్తుల పరం కావడంతో త్వరత్వరగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వారు.
ఊటీ వాతావరణం ఒక ఉప ఉష్ణమండల పర్వత వాతావరణం.ఉష్ణవాతావరణంలో నగరం ఉన్నప్పటికీ దక్షిణభారతదేశం యొక్క అత్యంత విరుద్ధంగా ఊటీ వాతావరణం సాధారణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా,చల్లగా ఉంటుంది.జనవరి,ఫిబ్రవరి నెలల రాత్రుల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.సాధారణంగా వసంతకాలంలో అక్కడి వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది.ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి.సగటు అత్యల్ప ఉష్ణోగ్రత సుమారు 5–12 °C (41–54 °F) మరియు సగటు అధిక ఉష్ణోగ్రత సుమారు 17–20 °C (63–68 °F) నమోదవుతాయి.దక్షిణ ఆసియా ప్రమాణాల ప్రకారం 25 °C (77 °F) ఉష్ణోగ్రత అక్కడ నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రత.ఊటీలో వర్షాకాలం సాధరణంగా చాలా చల్లగా అధిక తేమగల గాలులతో కూడి ఉంటుంది.ఏడాది పొడవునా గాలులు అధికంగా వీస్తుంటాయి. −2 °C (28 °F) అక్కడ నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత.నగరం డిసెంబరు నుంచి మార్చి వరకు పొడివాతావరణంతో 1250మి.మీటర్ల అవపాతంతో చవిచూస్తుంది.
ఊటీలో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బొటానికల్ గార్డెన్, లేక్, గవర్నమెంట్ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్హౌస్, కాఫీ తోటలు హిందూ దేవాలయాలైన మురుగన్ కోయిల్, వెంకటేశ్వర స్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఊటీ సమ్మర్ ఫెస్టివల్కు పెట్టింది పేరు. అలాగే మే నెలలో ఫ్లవర్ షో, ఫ్రూట్ షో పర్యాటకులను కట్టిపడేస్తాయి.
ఊటీ పరిసర ప్రాంతాలలో కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్, వెన్బాక్ డాన్స్, వెక్ హిల్స్, స్నోడెన్ పీక్, కూనూరు, డాల్ఫిన్స్ నోస్, లాంబ్స్ రాక్, లాన్ ఫాల్స్, సెయింట్ కేధరిన్ ఫాల్స్, సిమ్స్ పార్క్, సిమ్స్ పార్క్, కోటగిరి, కొడనాడ్ పాయింట్ తదితరాలు మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు.
ఊటీ లేక్ , ఊటీ దర్శించే పర్యాటకులకు ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1824 లో జాన్ సుల్లివాన్ సుమారు 65 ఎకరాల లో నిర్మించారు. వర్షాకాలం లో కొండలపై నుండి పడే నీటిని ఈ సరస్సు పొందుతుంది. అది నిండిన వెంటనే సుమారు మూడు సార్లు ఖాళీ చేస్తారు. స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపలు వేతాడతారు. ప్రస్తుతం బోటు విహారాల కారణంగా నే ప్రసిద్ధి చెందినది. బోటు విహారం చేస్తూ ప్రకృతి దృశ్యాలు ఆనందించవచ్చు. మే నెలలో ప్రభుత్వం రెండు రోజులపాటు బోటు రేస్ లు నిర్వహిస్తుంది.
"బొటానికల్ గార్డెన్" గురించి చెప్పుకోవాలంటే.. ఇది ఊటీ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 1847లో మార్క్విస్ చేత ప్రారంభించబడింది. అద్భుతమైన పూల మొక్కలు, అరుదైన పుష్ప జాతులను ఇక్కడ చూడవచ్చు. మే నెలలో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ బొటానికల్ గార్డెన్లో 20 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ చెట్టు తప్పకుండా దర్శించాల్సిందే.
అలాగే ఊటీకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండే "లేక్" చూడదగ్గది. ఇది 1824లో కోయంబత్తూర్ కలెక్టర్ జాన్ సిలివాస్ చేత నిర్మించబడింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఈ లేక్లో ఎంచక్కా బోటింగ్ చేయవచ్చు. ఇక్కడ చిన్నారుల కోసం చిల్డ్రన్స్ కార్నర్ కూడా ఉంది. ఆ తరువాత చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ మ్యూజియం. మైసూర్ రోడ్డులో ఉన్న ఈ మ్యూజియంలో పాతకాలంనాటి అనేక వస్తువులను చూడవచ్చు.
ఊటీ పరిసర ప్రాంతంలో ఉన్న "కెట్టివ్యాలి వ్యూ" తప్పకుండా చూడాల్సిందే. ఇది కూనూరు వెళ్లే దారిలో ఉంది. కోయంబత్తూర్, మైసూర్ మైదానాలలో ఉండే చిన్న గ్రామాలన్నింటినీ చూడవచ్చు. ఆ తరువాత ఊటీకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న "పైకరా" చూడాల్సిన మరో ప్రదేశం. ఇది మైసూర్ రోడ్లో ఉంది. ఇక్కడ రిజర్వాయర్, డ్యామ్ చూడదగ్గవి.
లాగే "అప్పర్ భవాని" అనే ప్రదేశం కూడా చూడదగ్గదే. ఇది కోరాకుందా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అవలంచి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నిశ్శబ్దలోయ చూడదగ్గది. ఊటికి 28 కిలోమీటర్ల దూరంలోని "అవలంచి" చూడదగ్గ మరో ప్రదేశం. ఇక్కడ సుందరమైన సరస్సు, చుట్టూ అడవితో పర్యాటకులకు స్వర్గాన్ని తలపిస్తుంది.
అలాగే నీలగిరిలో ఉన్న ఎత్తైన శిఖరం దొడ్డబెట్ట, అక్కడ నెలవైన టెలిస్కోపుతో నీలగిరి అందాల వీక్షణ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఇంకా జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏనుగులు, పులులు, జింకలు, నీటి పక్షులు, కొండ చిలువలను చూడవచ్చు. టేకు చెట్లు అధికంగా ఉండే ఈ శాంక్చురీకి దగ్గర్లోని మోయర్ జలపాతం, ముఖ్యమంత్రి గడియార స్తంభం చూడదగ్గవి.
ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలు ఊటీ సందర్శనకు అనుకూలమైన నెలలు. కోయంబత్తూరు నుంచి రైల్లో ఊటికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి కూడా ఊటీకి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రదేశాల నుంచి పలు రోడ్డు మార్గాలలో ఊటీ చేరుకోవచ్చు.
మద్రాసు నుండి ప్రతి రోజు రాత్రి మెట్టపాళయం రైలు 9గంటలకు ఉంటుంది. మరుసటిరోజు ఉదయం 6.15కు అదే రైలు మెట్టుపాళయం చేరుతుంది. అక్కడి నుండి ఊటీకి ఇంకో ట్రైన్ ఉదయం 7.45కి ఉంది. అది ఊటీకి మధ్యాహ్నం 12.10కి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.10కి బయలుదేరి 6.30కి మెట్టుపాళయం చేరుతుంది. అలాగే ఊటీ నుండి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న కన్నూరు నుండి ఉదయం 9.30కి, మధ్యాహ్నం 2.55కి, సాయంత్రం 6 గంటలకు మూడుసార్లు ఊటీ ట్రైన్ ఉంది. అదే ట్రైన్ తిరిగి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, 3 గంటలకు కన్నూరు వస్తుంది. ఈ రైలు ప్రత్యేకంగా పర్యాటకుల కోసం నడుస్తుంది. నీలగిరి పర్వతాలలోని ప్రకృతి అందాలకు, పచ్చని ప్రకృతికి ఆలవాలమైన ఈ పర్యాటక ప్రాంతాన్ని రైలులో ప్రయాణంలో చూసి తీరవలసిందే.
ఊటీ మద్రాసుకు 535, బెంగుళూరుకు 290, మైసూరుకు 160, కోయంబత్తూరుకు 89 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కవ మంది కోయంబత్తూర్, మైసూర్ నుండి వస్తుంటారు. కోయంబత్తూరు నుండి ఊటీకి ప్రతి 20 నిమిషాలకొక బస్సు ఉంది. ఈ బస్సులు వయా మెట్టుపాళయం మీదుగా వెళతాయి.