గ్రేటర్ హైదరాబాద్ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. ఇతర పార్టీల నుండి కార్పొరేటర్లను, ఎమ్యెల్యే లను తమ పార్టీలో చేర్చుకుని వలస వాదులతో బలం పెంచుకుని కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవ్వాలనుకున్న వ్యూహం ఫలించేటట్లు కనిపించటం లేదు. స్వలాభం కొసమే శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి వంటి వారు తెలుగుదేశం పార్టీని వీడారనే భావంతో ఆ పార్టీ కార్యకర్తలు గాని, సానుభూతి పరులు కాని, ఆ వర్గం ఓటర్లు కాని వారిని అనుసరించి టీఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళలేదు. వీరి చేరిక వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం అదనపు ప్రయోజనం చేకూరలేదనే విషయం ఇంటిలిజెన్స్ రిపోర్టులో వెల్లడైంది.
హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం, బిజెపి కూటమి బలంగా ఉంది. ఇప్పటికీ ప్రైవేటు ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు, గతంలో ఆ పార్టీకి మద్దతిచ్చిన విద్యార్ధులు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. మజ్లిస్ పార్టీతో పొత్తు వలన హిందూత్వ వాదులు పార్టీలకు అతీతంగా తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతిచ్చే అవకాశం ఉంది. నగరాల్లో మోడీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీతో పొత్తు వలన ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్ పార్టీకి బదిలీ అయ్యే అవకాశంలేదు, ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే సూచనలు కన్పిస్తున్నాయి, నగరంలో నీటి కొరత, కరెంట్ కోతలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించటం లేదు. ఇవన్నీ టీఆర్ఎస్ పార్టీకి గుబులు పుట్టించే అంశాలే!
అందువలనే జీహెచ్ఎంసీ ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయించే ఉద్దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. ఈ విషయంలో కెసిఆర్ బాగా వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోంది. ఈ పరిణామాలు ప్రతిపక్షాలకు నైతికంగా బలం కలిగించే విషయంగా భావించవచ్చు.