నిజంగానే సింహం జూలు విదిలించిందేమో! ఇక అక్రమార్కుల, అవినీతిపరుల, అరాచకవాదుల ఆటకట్టేనేమో!! అని ఆంధ్ర ప్రజానీకం సంబరపడింది.
కానీ... షరా మామూలే!!
* జగన్ కేసులన్నీ నత్త నడక నడుస్తున్నాయి.. నిజంగా జగన్ కేసుల విషయంలో చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే జగన్ కేసుల విషయంలో గతంలో ఎంతో ధైర్యంగా వ్యవహరించి నిజా నిజాలు నిర్భయంగా వెలికితీసిన సమర్ధవంతుడు, నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ కు తిరిగి ఆ కేసు పగ్గాలు అప్పగించవచ్చు కదా! ఈ విషయంలో మీకు ఇబ్బంది ఏమిటి, ఎందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించటం లేదు?
* జగన్ పార్టీలో ఉన్న నేరస్థులను, అవినీతి చరిత్ర కలవారిని తెలుగుదేశం పార్టీలో చేర్చేసుకుంటున్నారు, మిగిలిన మరికొంత మంది సన్నాసులకోసం పార్టీ గేట్లు బార్లా తెరచి ఉంచారు. ఆమంచి కృష్ణమోహన్ లాంటి కరడుకట్టిన నేరస్థుడిని తమ పార్టీలో చేర్చుకోవటాన్ని చంద్రబాబు నాయుడు ఏ రకంగా సమర్ధించుకుంటాడు?
* సాక్షాత్తూ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ యంపి సుజనా చౌదరి తన స్వంత కంపెనీ ఆర్ధిక లావాదేవిల విషయంలో మారిషస్ బ్యాంకుకు ఋణం ఎగవేతకు, మోసానికి పాల్పడినట్లు ప్రాధమిక ఆధారాలున్నాయని ప్రాసిక్యూషన్ కు హాజరు కావాలని సుప్రీమ్ కోర్టు సమన్లు జారీ చేసింది.. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలం వరకు ఇసుక దందాల్లో కోట్లు సంపాదించిన విషయం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన బహిరంగ సత్యమే!
* గత ప్రభుత్వాల్లోకన్నా ఈ ప్రభుత్వంలో, ఉద్యోగుల్లో అవినీతి దారుణంగా పెరిగిపోయింది. తమ వల్లే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తమతో పెట్టుకుంటే చంద్రబాబునాయుడుకు మూడినట్లేనని లంచాలు మరిగిన ఎన్జీవోలు, ఉన్నతాధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ అవినీతికి తెగబడుతున్నారు. ఐనా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మేసే మేతతో పోలిస్తే మేము తినేది యెంత! అని సమర్ధించుకుంటున్నారు.
* కాపునాడు బహిరంగ సభ నేపధ్యంలో తునిలో జరిగిన విధ్వంసం తరువాత చంద్రబాబు నాయుడు, హోం మంత్రి చేసిన ప్రకటనలో తునిలో జరిగిన విధ్వంసానికి, పొలిసు స్టేషన్ పై దాడి, రైలు దహనం సంఘటనల్లో భాద్యులను గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేస్తామని, ఈ ఘటనలో నేరస్థులు ఎంతటి వారైనా వదలిపెట్టే ప్రసక్తిలేదని ప్రకటించారు.. తుని రైలు దహనం సంఘటనలో కడప, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లా వాసులు కొందరిని భాద్యులుగా గుర్తించామని కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డిజిపి కూడా ప్రకటించారు. ఆ తరువాత తుని విధ్వంసంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసుల్లో ప్రధమ ముద్దాయిగా ముద్రగడ పద్మనాభంతో పాటుగా మరికొంత మంది నాయకులను నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ప్రమేయంతో కేసు పక్కదారి పట్టింది.
తుని ఘటనల వెనుక జగన్, వైకాపా నాయకుల హస్తం ఉన్నట్లు తమవద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రకటించిన ప్రభుత్వం మరి వాటిని బయట పెట్టి నిందితులను అరెస్ట్ చేయటంలో ఇంతకాలం ఎందుకు తాత్సారం చేస్తుంది? సాక్షాత్తూ పొలిసు స్టేషన్ పై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారినే ఇంతకాలం అరెస్ట్ చేయలేని ఈ చేతకాని ప్రభుత్వం, పోలీసులు.. ప్రజలకు, ప్రజల ఆస్థులకు ఏరకంగా భద్రత కల్పిస్తామని వారికి భరోసా కలిగిస్తారు? తుని విధ్వసం నిందితులతో ప్రభుత్వం కుమ్ముక్కై వారిపై చర్యలు తీసుకోకుంటే, ప్రభుత్వం చేతకాని తనాన్ని అలుసుగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని విధ్వంసకర సంఘటనలు జరగటానికి ఆస్కారముంది. కేవలం రాజకీయ దృష్టితో అరాచక శక్తులతో, బ్లాక్ మెయిలర్లతో ఒప్పందం కుదుర్చుకుని వారిని చూసి చూడనట్లుగా వదలివేసిన ప్రభుత్వం భవిష్యత్తులో ఆ శక్తులు చేసే అరాచకాలకు భాద్యత వహిస్తుందా?
దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా తుని విధ్వంసం నిందితులతో మీకు కుదిరిన రహస్య ఒప్పందం ఏమిటి? ఈ కేసుల్లో మీరు గుర్తించిన నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు చేపట్టలేదు?
ముఖ్యమంత్రి గారూ! మీ "మాటలు కోటలు దాటుతున్నాయి కానీ మీ చేతలు గడపకూడా దాటటంలేదు". ఉత్తరకుమార ప్రఘల్బాలు కట్టిపెట్టి ఇకనైనా చేతల్లో మీ సత్తా చూపండి.