ప్రతి సంవత్సరం ప్రకటించే "పద్మ" అవార్డుల్లో తెలుగు వారికి కనీసం రెండు, మూడుకు తగ్గకుండా "పద్మవిభూషణ్, పద్మభూషణ్" అవార్డులు, ఐదారు "పద్మశ్రీ" అవార్డులు దక్కేవి కాని ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దక్కింది కేవలం నాలుగు "పద్మశ్రీ" అవార్డులు మాత్రమే! దామాషా పద్ధతిలో జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకున్నా కాని తెలుగు రాష్ట్రాలకు 133 పద్మ అవార్డుల్లో కనీసం 12 దక్కాలి. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని డిల్లి పాలకులు మరో సారి దెబ్బతీశారు.
అమెరికాలో నివాసముండే "నోరి దత్తాత్రేయుడు" వంటి ప్రపంచ ప్రఖ్యాతి గడించిన వైద్యుడికి కేవలం ఒక మామూలు వైద్యురాలు "అనగాని మంజుల" తో సమానంగా "పద్మశ్రీ" అవార్డును మాత్రమే ప్రకటించి ఆ అవార్డు స్థాయిని, ఆయన స్థాయిని తగ్గించివేశారు. ఈ విషయంలో ఆయనకు చాలా అన్యాయం జరిగింది.
పి.వి.సింధు, కోట శ్రీనివాస రావు, మిథాలిరాజ్ కు "పద్మ" అవార్డులు దక్కటం కొంతలోకొంత ఉరట నిచ్చే అంశం. కాని విచారించదగ్గ అంశం ఏమిటంటే వీరందరూ తెలంగాణా రాష్ట్రంలో నివసించేవారే! "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రంలో నివసించే వ్యక్తులకు ఒక్కరికి కూడా ఈ అవార్డు దక్కకపోవటానికి "వెంకయ్య నాయుడు", ఈ రాష్ట్రము నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న "నిర్మల సీతారామన్" సిగ్గు పడాలి.
బిజెపి వాళ్ళు, మోడీ.. ఆంధ్రులను చాలా చిన్న చూపు చూస్తున్నా కాని చంద్రబాబు నాయుడుకు కాని, కేంద్ర మంత్రులకు కాని, మిగిలిన బిజెపి నాయకులకు కాని చీమ కుట్టినట్లైనా లేదు... మనకు అన్యాయం జరిగినప్పుడైనా నోరు తెరిచి మాట్లాడలేక పోతున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు చేసిన వాగ్దానాలకు బిజెపి వారు, వెంకయ్య నాయుడు ఇప్పుడు వక్ర భాష్యాలు చెబుతున్నారు... వీళ్ళని నమ్ముకుంటే ఆంధ్ర ప్రజలకు అధోగతే!
చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్ళుతెరచి ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని విషయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి... పోరాడితే పోయేదేమిలేదు! అవమానాలు, అసమానతలు తప్ప!!