రైలు తగలబెట్టడం బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైలు తగటబెట్టడం మామూలు విషయం కాదని, దీనిపై పోలీసులు విచారణ జరపాలని ఆయన కోరారు. మిగతా బీసీ కులాలకు నష్టం కలగకుండా కాపులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. రిజర్వేషన్లు ఒక్క రోజులో రావడం అసాధ్యమని, అందరూ సంయమనంతో వ్యవహరించాలని పవన్ కోరారు. ఉద్యమ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించారు. శాంతియుతంగా జరగాల్సిన సభ ఎందుకిలా దారితీసిందో తనకర్థం కాలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులు లేనిదే ఇలాంటి ఘటనలు జరగవని పవన్ అనుమానం వ్యక్తం చేశారు.
ఒక విషయానికి మరో విషయానికి ఎక్కడా పొంతన కుదరకుండా, ఏ మాత్రం క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ ప్రకటన ఉంది. రిజర్వేషన్లు ఒక్కరోజులోనే రావటం అసాధ్యమని, కాపులకు రిజర్వేషన్లు కమీషన్ ఏర్పాటుతోనే సాధ్యమంటూనే.. వాడుకుని వదిలేశారన్న ఆవేదన కాపుల్లో ఉందని, కాపులకు నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందని పవన్ విమర్శించటంలో ఆయన ఆంతర్యం ఏమాత్రం అర్ధం కాకుండా ఉంది.
ఉద్యమ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అసాంఘిక శక్తులు లేనిదే ఇటువంటి సంఘటనలు జరగవన్న పవన్ ఆ సంఘటనలకు కారణం ఎవరన్నది సూటిగా చెప్పలేదు.
తాను ఓ కులం కోసం పోరాడనని, ప్రజల కోసం ఉద్యమించేందుకే జనసేన పార్టీని పెట్టానని చెప్పిన పవన్ కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయాలనుకుంటే తన పార్టీ పేరు మార్చి "కాపు సేన" అని నామ కారణం చేసుకుంటే ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు.
ఏ విషయాన్నైనా సూటిగా చెప్పలేకపోవటం, "కర్ర విరక్కుండా పాము చావకుండా" అన్నట్లుండే డొంక తిరుగుడు వ్యాఖ్యలు పవన్ రాజకీయ అపరిపక్వతను మరో సారి చాటిచెప్పాయి. .