ఈ చిత్రం వలన లాభపడేది ముందుగా రాజమౌళి, ఆ తరువాత ఈ చిత్రాన్ని అన్ని ఏరియాలకు మంచి రేటుకు అమ్ముకున్న నిర్మాతలు, చివరగా హీరో ప్రభాస్. ఒక్కో పార్ట్ 75 కోట్లకు మించని ఈ చిత్రాన్ని ఒక్క తెలుగు భాషలోనే 75 కోట్లకు నాన్ రికవరబుల్ అడ్వాన్సు తో (శాటిలైట్ రైట్స్ కాకుండా) అమ్మారు. ఇతర భాషలకు, ఓవర్సీస్ హక్కులు, డబ్బింగ్ హక్కులు కనీసం మరో వంద కోట్లకు తక్కువ కాకుండా అమ్మేశారు, అంటే బాహుబలి మొదటి పార్ట్ సుమారుగా 175 కోట్ల వ్యాపారం జరిగింది.
తెలుగులో అత్యధిక ధర చెల్లించి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న పంపిణీదారులు, దియేటర్ యజమానులు ఈ చిత్రానికి టికెట్ ధరను విపరీతంగా పెంచి వేశారు. ఒక్కో టికెట్ కనీస పక్షం రూ.200, గరిష్టం రూ.700 నిర్ణయించటమే కాకుండా ఆ టికెట్లను సైతం బ్లాకులో విక్రయిస్తూ ప్రేక్షకుల బలహీనతను సొమ్ము చేసుకొంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం మరి ప్రచార సాధనాల దృష్టికి వచ్చినా ఎందుకు స్పందించటంలెదో వారికే తెలియాలి.
ఈ చిత్ర దర్శకుడు, నిర్మాతలు ఇంకొన్ని విషయాలు శలవిచ్చారు, ఈ చిత్రం అప్పు చేసైనా, ఎవడి జేబైనా కొట్టేసైనా, ముష్టి యెత్తుకునైనా, అత్యధిక రేటు పెట్టి కొనుక్కుని థియేటర్ లోనే చూసి వీరిని బ్రతికించాలట. పైరసి సిడి లు చూసినా, ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకుని చూసినా కేసు పెడతారట, ఏమి సంఘ సేవ, యెంత దేశభక్తి! ఈ సినిమా హీరో ఈ చిత్రం విడుదల కోసం తన వివాహం వాయిదా వేసుకొన్నాడట... ఈయనకు పెళ్లి లేటైనా, అసలు కాకపోయినా దేశానికి కాని, సమాజానికి కాని ఏమి నష్టం? ఈయన డబ్బుల కోసం నటిస్తున్నాడు తప్ప దేశం కోసం, ప్రజల కోసం కాదే! మద్యం, మత్తు లాగే కొందరికి ఈ సినిమాలు కూడా బలహీనత, అందుకే వీరి బలహీనతల పై గురి పెట్టి ఈ చిత్ర నిర్మాతలు విపరీతమైన పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులను ఆకర్షించి వలవేస్తున్నారు. మందు వ్యసనం ఉన్న డబ్బున్నోడు రేటేక్కువైనా బ్లాక్ డాగ్ కొనుక్కుని తాగుతాడు, పేదోడు చీప్ లిక్కర్ కొనుక్కుని తాగుతాడు. అక్కడ కనీసం ఆ ఛాయస్ ఐనా ఉంది కానీ ఇక్కడ కనీస ఛాయస్ కూడా లేకుండా చేశారు. లిక్కర్ కంపెని యజమానులకు అడ్డగోలు ధరలు నిర్ణయించే అధికారం లేదు, లిక్కర్ వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకొనే వీలు లేదు, కానీ సినిమా వాళ్లకు మాత్రం ఈ వెసులుబాటు ఉందా?
ఎప్పుడైనా పండుగల సమయం లో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆర్టిసి కాని, రైల్వేలు కాని ప్రయాణీకుల సౌకర్యార్ధం ప్రత్యెక బస్సులు, రైళ్ళు ఏర్పాటు ఏర్పాటు చేసి చార్జీలు కొద్ది మొత్తం పెంచితేనే గొంతు చించుకునే మేధావులు, మీడియా ఇప్పుడు కొందరు వ్యక్తులు ప్రేక్షకుల బలహీనతలు ఆసరాగా తీసుకుని పబ్లిగ్గా ఇంత దారుణానికి దిగబడితే ప్రశ్నించరె?
ఈ సినిమా వాళ్ళు కేవలం పక్కా వ్యాపారస్తులే.. వీళ్లేమి సంఘసేవ, ప్రజాసేవ చేయటం లెదు. సినిమా రంగంలో కేవలం కొంత మంది పెద్ద నిర్మాతలు, దర్శకులు, నటులు మాత్రమె లబ్ది పొందుతున్నారు. చిన్న నటులు, నిర్మాతలు, దర్శకులు కనీసం సినిమా రిలీజు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఫిలిం ఇండస్ట్రీ బాగుపడాలంటే పెద్ద సినిమాలు 10 కన్నా చిన్న సినిమాలు 100 రావాలి, అప్పుడే ఈ రంగంలో చిన్న, పెద్ద అందరూ బాగుంటారు.
అయ్యా రాజమౌళి గారూ... మీ సినిమా బాహుబలి వలన ఈ రాష్ట్రానికి కాని, దేశానికి కానీ, ప్రజలకు కాని ఏమి ప్రయోజనం, ప్రజలందరూ తమ సొమ్ము త్యాగం చేసి మీరు నిర్ణయించిన ధరలకే, మీరు బ్లాకు లో అమ్మే ధరలకే ఈ సినిమా చూడాలంటున్నారు , మీ సామజిక సృహ, సంఘసేవ అమోఘం... మీరు బాట వేశారు... రేపు అదే బాటలో నడవటానికి సినిమా బలహీనత ఉన్న ప్రజలను దోచుకోటానికి మీ ఇండస్ట్రీ పెద్దలు సిద్ధంగా ఉన్నారు.