"వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి" కానీ గ్రానైట్ రాయితో కొయ్యలేము అని కెసిఆర్ కు బాగా ఎరుకయ్యింది, అందుకే సెటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఖైరతాబాద్, జూబిలీ హిల్స్ , సనత్ నగర్, ఎల్బి నగర్, కుత్బుల్లాపూర్, కుకట్ పల్లి, లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 20 స్థానాల్లో సెటిలర్స్ కు తెరాస టిక్కెట్లు ఇచ్చే విషయంలో కెసిఆర్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడట.
ఈ నిర్ణయం ఒక రకంగా సెటిలర్స్ ప్రయోజనాలకు మేలు చేకూర్చే పరిణామమే.. సెటిలర్స్ అధికంగా ఉన్న స్థానాల్లో అన్ని పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్ధులు వారే ఉంటే ఏ పార్టీ అభ్యర్ధి గెలిచినా వారి ప్రయోజనాలకు ధోకా ఉండదు, అదే సమయంలో వారికి కొంత నైతిక బలం కూడా చేకూరుతుంది.
తుమ్మల నాగేశ్వరరావు కు మంత్రి పదవి అస్త్రాన్ని ప్రయోగించి ఖమ్మంలో ఆ వర్గం వారి ఓట్లతో ఖమ్మం జిల్లా ఎమ్మెల్సి ఎన్నికల్లో లబ్ది పొందిన తెరాస ఇప్పుడు అదే అస్త్రాన్ని జంట నగరాల్లో కూడా ప్రయోగించి మెజారిటి సీట్లు దక్కించుకోవాలని యోచిస్తున్నారట. తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంతో ఆర్ధికంగా, రాజకీయంగా జంట నగరాల పరిధిలో బలంగా ఉన్న ఆ వర్గం వారి ఓట్లు కొల్లగొట్టాలనే విషయంలో తెరాస ఏమాత్రం సఫలీకృతం అవుతుందో వేచి చూడాల్సిందే!
కెసిఆర్, తెరాస పార్టీ తరుపున టికెట్లు ఇచ్చే మాజీ తెదేపా అభ్యర్ధుల్లో కనీసం ఏడెనిమిది గెలుపు గుర్రాలు ఉన్నాయనేది ఆ పార్టీ వర్గాల భోగట్టా! ఏదేమైనా తెరాస - వైకాపా ఎత్తులు తెదేపా - బిజెపి కూటమి అభ్యర్ధుల విజయావకాశాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది.
పార్టీ ఏదైనా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం వాళ్ళు కనీసం 25 నుండి 30 స్థానాల్లో కార్పొరేటర్లు గా గెలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.