రాష్ట్ర విభజన జరిగిన తరువాత భద్రాచలం, యాదగిరి లక్ష్మి నరసింహస్వామి ఆలయం తప్ప మిగిలిన ప్రసిద్ధ ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాయి. విభజన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరుపున జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు కడప జిల్లా, రాజంపేట సమీపంలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం నిలయమైంది, ఈ దేవాలయం పునరుద్ధరణకు, ఆదునీకరణకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది, భవిష్యత్తులో భద్రాచలం రామాలయానికి దీటుగా ఈ ఆలయం రూపుదిద్దుకుంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచంలోనే ప్రసిద్ధమైన బౌద్ధ ఆరామం, జపాన్, సింగపూర్ బౌద్ధుల ఆర్ధిక సహాయంతో త్వరలోనే అమరావతి నూతన రూపు సంతరించుకుని ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం కాబోతుంది. అమరావతి సమీపంలో కొండవీడు ప్రాంతంలో త్వరలోనే ఇస్కాన్ వారిచే 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే శ్రీకృష్ణ ఆలయం ఆంధ్ర రాష్ట్రానికే మకుటాయమానంగా మారనుంది. నంబూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రసిద్ధ జైన దేవాలయం నిర్మించబడింది. విజయవాడ నగరంలోని గుణదల మేరి మాత ఆలయం దక్షిణ భారత దేశంలోనే క్రైస్తవ మతస్తులకు ఎంతో పవిత్రమైనది. కడప పట్టణంలోని ప్రసిద్ధమైన అమీన్ పీర్ దర్గా ముస్లిములతో పాటు హిందూ మతస్థులు కూడా సందర్శిస్తుంటారు.
ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అరసవల్లి సూర్య దేవాలయం, దాక్షారామం, మంగళగిరి లక్ష్మి నరసింహస్వామి ఆలయం, మంత్రాలయం, అహోబిలం ,మహానంది, కోటప్పకొండ, పెనుగంచిప్రోలు లక్ష్మి తిరుపతమ్మ ఆలయం, మొదలైన దేవాలయాలు కూడా ప్రసిద్ధి చెందాయి, ప్రభుత్వం మరియు పర్యాటక శాఖ వారు వీటికి మరింత ప్రాచుర్యం కల్పించవలసి ఉంది.
విజయవాడ నగరానికి 50 కిలోమీటర్ల పరిధిలోనే కనకదుర్గ ఆలయం, మేరిమాత ఆలయంతో పాటు అమరావతి, కొండవీడు, మంగళగిరి, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, నంబూరు ఆలయాలు ఉన్నాయి. తిరుపతికి 50 కిలోమీటర్ల పరిధిలో శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు ఆలయాలు ఉన్నాయి.
హిందూ మతంలో ఇంతమంది దేవతలకు ఏ రాష్ట్రంలోనూ దేవాలయాలు లేవు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవతలకు సంబంధించిన ప్రసిద్ధ ఆలయాలే కాకుండా ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన మతాలకు చెందిన ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉండటం ఎంతో విశేషం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పుణ్యక్షేత్రాల ప్రచారంపై దృష్టి పెట్టి, యాత్రికులకు సరైన రవాణా, వసతి సౌకర్యాలు కల్పించి దేశ, విదేశాల పర్యాటకులను, భక్తులను ఆకర్షించగాలిగితే పర్యాటక రంగం ద్వారానే ప్రభుత్వానికి విశేషమైన ఆదాయం సమకూరటంతో పాటుగా ఎందరికో ఉపాధి కూడా లభ్యమౌతుంది. ఆంధ్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆలయాల విషయంలో దృష్టిపెట్టి జాతీయ, అంతర్జాతీయ ప్రచారం కల్పిస్తే భారతదేశం లోనే ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పుణ్యక్షేత్రాల కూడలిగా, పర్యాటక రాష్ట్రంగా అవతరించే అవకాశం మెండుగా ఉంది.