ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్లో రెవిన్యూ లోటు భర్తీ చేయటానికి కేంద్రం సహాయం చేస్తుందని వాగ్దానం చేశారు, కాని కనీసం ఈ వాగ్దానం కూడా నిలబెట్టుకో లెకపొయారు. గత ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా కనీసం నేరవేర్చలేకపోయారు. బిజెపి అధిష్టానం చిన్న రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయోజనాలే వారికి ముఖ్యంగా కనిపిస్తుంది. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకోసమే ఎక్కువ భాగం నిధులు కేటాయించి విభజనలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఆర్ధిక సహాయం విషయంలో మొండి చెయ్యి చూపిస్తున్నారు.
భారత రత్న పురస్కారానికి తెలుగు వారు కాని, దక్షిణాది వారు కాని అనర్హులని బిజెపి ప్రభుత్వం తెల్చివేసింది. వాజపేయి లాంటి వ్యక్తిని భారత రత్న పురస్కారానికి ఎంపిక చేయటాన్ని ఎవ్వరూ తప్పుపట్టక పోయినా... అదే సమయంలో ఎన్టీఆర్ కు కాని, పివి నరసింహారావుకు కాని భారత రత్న పురస్కారం వస్తుందని ఆశించిన వారు ఎంతో నిరాశ చెందారు.
బిజెపి ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదని ఆంధ్ర ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. చిన్నా, చితకా నాయకులు తమ పార్టీలో చేరుతున్నందుకు బిజెపి వారు సంబర పడవచ్చుకాని గత ఎన్నికల్లో బిజెపిని, మోడిని అభిమానించి ఓట్లేసిన ఆంధ్ర ప్రజానీకానికి ఈ పార్టీపై, పార్టీ నాయకులపై భ్రమలు తొలగిపోయాయి.
త్వరలో ప్రకటించబోయే 'పద్మ' అవార్డుల విషయంలో కాని, వచ్చే సంవత్సరంలో ప్రకటించబోయే రైల్వే బడ్జెట్లో కాని, ప్రత్యెక ప్రతిపత్తి విషయంలో కాని ఆంధ్ర ప్రదేశ్ కు సరైన న్యాయం జరగని పక్షంలో తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర ప్రజలు బిజెపి ప్రభుత్వం పై తీవ్రమైన వత్తిడి తీసుకువచ్చి తిరుగుబాటు చెయాలి. బిజెపి పార్టీ, కేంద్ర ప్రభుత్వ పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా ఉంటే 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే'! అనే సామెతను ఇకనుండి 'బిజెపి వారి మాటలకు అర్ధాలే వేరులే'! అని సవరించుకునే పరిస్థితి వస్తుంది.