వీరిపై ఇప్పటికే ఎన్నో, పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి, ఈయనకు తెలుగు నేలపై ఎందరో అభిమానులున్నారు. చిన్నతనం నుండే నేర్చుకున్న ఆంగ్ల, ఫ్రెంచ్, క్రియోల్ భాషలతో సమానంగా ఈయన తెలుగు భాషను అనర్గళంగా ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా స్వచ్చంగా పలుకుతారు. ఈయనకు తెలుగు వ్యాకరణంపై కూడా ఎంతో పట్టుంది. సంజీవ గారు మృదు స్వభావి, చక్కటి ఉచ్చారణతో వీరు మాట్లాడే తెలుగు విన సొంపుగా ఉంటుంది. ఈయనకు తెలుగు భాష అంటే చెవి కోసుకోవటమే కాదు ప్రాణం కూడా ఇచ్చేంత అభిమానం.
సంజీవ గారికి తెలుగుమీద అభిమానం దేవాలయ పుజారిగారయిన తన తాతగారి నుండి సంక్రమించిన వారసత్వపు సంపద. మారిషస్ విశ్వవిద్యాలయం నుంచీ, మహాత్మాగాంధీ ఇన్ స్టిట్యూట్ నుంచీ తెలుగు బియ్యే (ఆనర్స్) లో పట్టా పుచ్చుకోవటం ద్వారా తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నారాయన.
తెలుగు సంస్కృతి ,సాహిత్యం మీదున్న ఎనలేని అభిమానంతో సంజీవ గారు తెలుగు సాంస్కృతిక వారసత్వం మీద రావి ఆకులపై 1400 చిత్రాలు అధ్బుతంగా చిత్రీకరించారు. వీరి కృషిని, ప్రతిభను గుర్తించిన గిన్నిస్ బుక్ వారు ఈ ప్రపంచ రికార్డుకు తమ పుస్తకంలో చోటు కల్పించారు. . శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారు రావి పత్రాలపై చిత్రీకరించిన తెలుగు కళామ తల్లి శ్లోకాలు, తెలుగు సంస్కృతీ మీద అష్టోత్తర శత అశ్వత్త తెలుగు వారసత్వ కళా వైభవం ఆ దేశ ప్రధాని చేతులపై ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నవీన్ చంద్ర మాట్లాడుతూ రావి పత్రాలపై ఇన్ని అద్భుతాలను సృష్టించిన శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారికి తమ హృదయపూర్వక అభినందనలు అందజేసారు.
శ్రీ సంజీవ నరసింహ గారు దేశం కాని దేశం మారిషస్ లో తెలుగు బ్రహ్మొస్థవాలను నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్నారు. అంతే కాకుండా వారు రంగవల్లులు, భజనలు, త్యాగరాజ, అన్నమయ్య కీర్తనలు అక్కడి తెలుగు వారికి నేర్పించి మన తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను మారిషస్ ద్వీపంలో వ్యాప్తి చేస్తున్నారు.
తెలుగు భాషా అభివృద్దికి వారు చేస్తున్న కృషికిగాను ప్రతి తెలుగు వాడు ఆయనకు ఎంతో రుణపడి ఉంటాడు. సంజీవ అప్పడు గారికి తెలుగు నేల ఎప్పుడూ ఒక పుణ్యభూమే! ఈ తెలుగు సీమ తన పుణ్యభూమి అనే ప్రేమ వచనంతోనే ఎప్పుడూ సంభోదిస్తుంటారు. 56 సంవత్సరాల వయస్సులో కూడా ఈయన తన పూర్వీకుల నేలపై అభిమానంతో తరచుగా తెలుగు రాష్ట్రానికి వచ్చి వెళుతుంటారు. గోదావరి పుష్కరాలకు తనతో పాటు మరో పదిమంది ఈ పుణ్యభూమికి వస్తున్నామని, పది మంది వృద్ధులతో రాష్ట్రంలో పది చోట్ల సేకరించిన మట్టిని మారిషస్ దేశంలో తెలుగు భాషా స్థూప నిర్మాణానికి ఉపయోగిస్తామని చెప్పారు.
శ్రీ సంజీవ గారు మహాత్మా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యాసంస్థలో తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ , మారిషస్ సొసైటీ ఆఫ్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు, తెలుగు కల్చరల్ హెరిటేజ్ చైర్మన్ , మారిషస్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ లో రేడియో అండ్ టెలివిజన్ శాఖ భాధ్యులు
పరాయి గడ్డపై పుట్టి, తెలుగు భాషపై అభిమానంతో భాషా సేవ చేస్తున్న శ్రీ సంజీవ గారు తెలుగువారందరికీ స్ఫూర్తిప్రదాత. TORI (తెలుగు ఆన్ లైన్ రేడియో) లో ప్రతి శనివారం వీరు నిర్వహించే ముప్పది నిముషాల కార్యక్రమానికి ఎంతో మంది అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. మారిషస్ 'తెలుగు కోకిల సంజీవ అప్పుడు' గారికి వందనం.. అభివందనం..