గతంలో అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన మోడీ రాజధాని నిర్మాణానికి భారీ నజరానాలు ప్రకటిస్తారని ఎదురు చూసిన వారికి మోడీ ఇచ్చిన కానుక "పిడికెడు మన్ను" తీవ్రమైన క్షోభను కలిగిస్తే, వచ్చే బడ్జెట్ లో రాజధానికి భారీగా నిధులు కేటాయిస్తారని కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు ఆంధ్ర ప్రజలకు సర్ది చెప్పి నోళ్ళు మూయించారు. కానీ నిన్నటి బడ్జెట్లో జైట్లీ ఆంధ్ర ప్రజలకు చేతిలో చిప్ప పెట్టాడు. అమరావతి నిర్మాణానికి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు సరి కదా! పోలవరం ప్రాజెక్టుకు కేవలం 100 కోట్ల రూపాయలు కేటాయించి సరిపెట్టారు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే నిర్మాణ వ్యయం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలకు పైగా పెరుగుతుంది, ఈ లెక్కన చూస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావటానికి ఇంకా లక్ష సంవత్సరాలు పడుతుంది.
ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తారని ఎదురు చూసిన ఉత్తరాంధ్ర వాసులకు మరో సారి చెవిలో పువ్వు పెట్టింది బిజెపి ప్రభుత్వం. రైల్వే జోన్ విషయంలో ఉత్తరాంధ్ర వాసులను నిరాశ పరచిన బడ్జెట్ విశాఖ మెట్రో రైలుకు కేవలం 10 లక్షలు కేటాయించి చేతులు దులుపుకుని ఉత్తరాంధ్ర వాసులను అవహేళన చేశారు. "చేతకాని మొగుడు మంచం మీదున్నా ఒక్కటే! మంచం కిందున్నా ఒక్కటే!!" అనే సామెత విశాఖ బిజేపి పార్లమెంటు సభ్యుడు "కంభంపాటి హరిబాబు" కు బాగా వర్తిస్తుంది.. ఏదో విశాఖ ప్రజల దయవల్ల ఎంపి గా గెలిచి పొయ్యాడు.. ఇంకో మూడేళ్ళు తన పదవికి ధోకా లేదు, ఈ లోపు ప్రజలకిచ్చిన హామీలను అటకెక్కించి జనాలకు జోలపాడుదామనుకుంటే హరిబాబుకు తీవ్రమైన భంగ పాటు తప్పదని విశాఖ ప్రజలు హెచ్చరిస్తున్నారు.. ఇప్పటికైనా సొల్లు కబుర్లు కట్టిపెట్టి విభజన సమయంలో, ఎన్నికల మానిఫెస్టోలో ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బిజెపి నాయకులు, ఎంపిలు మంత్రులు, ఆంధ్ర ప్రజలకు సహనం నశించిన రోజు వారి ఆగ్రహావేశాలకు గురికావల్సివస్తుంది
తెలుగుదేశం ప్రభుత్వం పై విమర్శలు చేయటం, జగన్ తో కలిపి కుట్రలు చేయటం మాని బిజెపి నాయకులు తమ రాజకీయాలు, స్వలాభం పక్కనపెట్టి ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి, ప్రత్యెక హోదాపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి..
ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింటే ఏమౌతుందో గతంలో ఎన్టీఆర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి ఇందిరా గాంధికి చూపించాడు... మరో సారి అలా జరగక ముందే బిజెపి నాయకత్వం మేల్కొని ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన, జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం చూపాలి, ఈ విషయంలో చంద్రబాబు కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల తన మెతక వైఖరిని మార్చుకొని వారిపై ఒత్తిడి తీసుకురాని పక్షంలో ఆంధ్ర ప్రదేశ్ కు భవిష్యత్తులో కూడా న్యాయం జరిగే అవకాశం కనిపించటం లేదు.. దేవుడా! దగా పడ్డ ఆంధ్రులని నువ్వే కాపాడాలి!!