ఈ దేశంలో అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ స్కూల్ లో అవినీతి పాఠాలు నేర్చుకున్న నాయకులు ఇతర పార్టీల్లో చేరి మొత్తం పార్టీల నన్నింటిని అవినీతి మయం చేశారు. ఈ దేశంలో బయటపడ్డ అత్యంత అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ నేతలవే! ఈ పార్టీ నేతలు దేశ సంపదను భారీగా కొల్లగొట్టారు.
బిజెపి పార్టీ అవినీతి విషయంలో ఈ దేశంలో రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ పార్టీలో ఆర్ఎస్సెస్ నేపధ్యం ఉన్నవారు అవినీతికి కొంత ఎడంగా ఉన్నా కానీ మిగిలిన నాయకులు ఎందరో అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్నవారే! ఈ మధ్య కాలంలో ఇతర పార్టీల్లో అవినీతి పరులుగా ముద్రపడిన వారు బిజెపి పార్టీలో చేరి ఆ పార్టీని మరింతగా కలుషితం చేస్తున్నారు.
కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో లేని రాష్ట్రాల్లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు కానీ త్రిపుర రాష్ట్రంలో తప్ప కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఎందరో మంత్రులు, శాసనసభ్యులు అవినీతి మకిలి అంటించుకుని ఆ రాష్ట్రాల్లో పార్టీని అధోగతి పాలుచేసి అధికారానికి దూరమయ్యారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీల వారు అధికార పార్టీలతో లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని అవినీతికి పాల్పడటం అందరికి తెలిసిన విషయమే!
ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఇక్కడ అధికారంలో, ప్రతి పక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అవినీతి తక్కువేమీ కాదు. తెలుగుదేశం పార్టీల్లో జేబు దొంగలు, తెరాసలో గజ దొంగలు, వైకాపా లో బందిపోటు దొంగలు ఉన్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస తన బలం పెంచుకోవటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ విపరీతంగా అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ అవినీతిని, అవినీతి పరులని ప్రోత్సహిస్తుంది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుని కూతురు, కొడుకు, మేనల్లుడి పైన అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇక మిగిన మంత్రుల సంగతి సరే సరి!
ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కొందరు మంత్రులు అవకాశం దొరికితే గుడిని, అందులో లింగంతో సహా మింగేసేవారే, కానీ చంద్రబాబు నాయుడు పై భయమో, భక్తో కారణంగా అవినీతికి దూరంగానే ఉంటున్నారు కానీ చిలక్కొట్టుడు మామూలే అంటున్నారు పార్టీ వర్గాలు. ఇసుక అక్రమ దందాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు, శాసనసభ్యులకు, మంత్రులకు వాటా ఉందనేది అందరు ఒప్పుకునే విషయమే! తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి కంపెనీల పైన అనేక ఆర్ధిక పరమైన కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఏతా వాతా చేస్తే అవినీతి విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి 'గుడ్డిలో మెల్ల' అనే చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడుకు అవినీతి మరకలు అంటక పోవటం కొంతలో కొంత నయం కానీ అయన కొడుకు లోకేష్ పైన, అతని కోటరీ పైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారంలోకి వస్తామని కలలు కని అధికారం అందనంత దూరంలో ఆగిపోయిన ప్రతిపక్ష వైకాపాది విచిత్రమైన పరిస్థితి... చిత్రమేమిటంటే కాంగ్రెస్, తెదేపా పార్టీల్లో అత్యంత అవినీతి పరులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు శిక్షలు పడిన నేతలు, రౌడి షీటర్లు, సంఘ విద్రోహ శక్తులు మొత్తంగా ఈ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ నాయకుడే స్వయంగా 26 కేసుల్లో ముద్దాయిగా ఉండి జైలు శిక్ష అనుభవించి, ప్రస్తుతం బెయిలు పై బయట ఉన్నాడు.. ఆంధ్ర ప్రదేశ్ లో వైకాపా సంఘ విద్రోహ శక్తులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ పార్టీలో చేరాలంటే ఏదో ఒక కేసులో శిక్ష పడి ఉండటమో లేక ముద్దాయిగా ఉండటమో ఒక అదనపు క్వాలిఫికేషన్.